వైసిపి వంటి వారు కోర్టుకు, కేంద్రంతో మాట్లాడ్తా: చంద్రబాబుకు కోపమొచ్చింది
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వారంలో 36 వేల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే మట్టి తవ్వకం జరిగిందని తెలుసుకున్న సీఎం.. పనులు జరుగుతున్న తీరుపై నిలదీశారు.
రోజుకు 2.6లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తవ్వకం జరగాల్సి ఉండగా వారానికి కేవలం వేలల్లోనే పని జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే మీ కంపెనీ సీఎండీ, జల వనరులశాఖ కార్యదర్శి పోలవరంలోనే ఉండి పనులు చేయించాల్సి వస్తుందన్నారు.
వర్షాల వల్ల పనులు చేయలేకపోయామని, నీళ్లు తొలగిస్తున్నా మళ్లీ వర్షాలతో చేరుతున్నాయని త్రివేణి సంస్థ ఈడీ కార్తికేయన్ తెలిపారు. వర్షాలు ఆగిన తర్వాత రోజుకు మూడు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం జరిగేలా చూస్తామని, ఆ స్థాయిలో యంత్ర సామగ్రిని సమీకరించామన్నారు.
కాగా పోలవరం పనులు వేగం పెంచేందుకు డిజైన్ల ఆమోదానికి సంబంధించి ఏదైనా అవసరమైతే కేంద్రంతోను మాట్లాడతామని చంద్రబాబు చెప్పారు.
ఏ చిన్న లోపం వచ్చినా వైసిపి వంటి ప్రతిపక్షాలు పోలవరం అడ్డుకునేందుకు న్యాయస్థానాలకు వెళ్తున్నాయని, న్యాయస్థానాల్లో వాదించే న్యాయవాదులను కూడా ప్రతి నాలుగో సోమవారం సమావేశానికి పిలుద్దామన్నారు. పోలవరం వద్ద ఐకానిక్ వంతెన ఏర్పాటు చేయాలన్నారు.