విభజన - సుప్రీం కోర్టు వ్యాఖ్య: ఢిల్లీ దాకా వెళ్లి బోల్తాపడ్డ జగన్?
న్యూఢిల్లీ/విజయవాడ: పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి బొక్కబోర్లా పడ్డారని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. రోజా సస్పెన్షన్ వ్యవహారంపై గురు, శుక్రవారాలు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చురకలు అంటించింది. విభజన నేపథ్యంలో ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఇలాంటి సమయంలో సస్పెన్షన్ విషయంలో పట్టుదలకు పోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
అధికార, ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధికి కలిసి పని చేయాలని హితవు పలికింది. అదే సమయంలో సభలో రోజా తీరును ధర్మాసనం తప్పుబట్టింది. ప్రభుత్వానికి, విపక్షానికి సుప్రీం.. రాష్ట్ర పరిస్థితుల విషయమై చురకలు అంటించినప్పటికీ, అంతిమంగా రోజా విషయాన్ని తప్పుపట్టడం గమనార్హం.
రోజా సస్పెన్షన్ వ్యవహారంలో నైతికంగా తమదే గెలుపు అనే వాదనలు వినిపిస్తున్నాయి. రోజా సస్పెన్షన్ వ్యవహారంలో ఇరుపక్షాలు కూడా పట్టుదలతో ఉన్నట్లుగా మొదటి నుంచి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ వద్దని వైసిపి, రోజాను అసెంబ్లీకి రానీయవద్దని టిడిపి మొదటి నుంచి పట్టుదలతో కనిపిస్తున్నాయి.
విభజన సమస్యల నేపథ్యంలో పట్టువిడుపులు ఉండాలని, ఇరు పక్షాలు కూడా సమన్వయంతో వెళ్లాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలా పట్టుదలకు వెళ్లడం సరికాదని చంద్రబాబుకు కూడా సుప్రీం కోర్టు అక్షింతలు వేసినట్లేనని అంటున్నారు.
అయితే, రోజా ప్రవర్తన విషయంలో మాత్రం కోర్టులో టిడిపి వాదనకు న్యాయం చేకూరిందని, జగన్ బోల్తా పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. క్షమాపణతో పోయే దాని కోసం హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే వెళ్లింది.
అంతకుముందు తాము చేసిన వ్యాఖ్యల పైన చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు క్షమాపణలు చెప్పారు. కానీ రోజా విషయంలో మాత్రం వైసిపి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. తొలుత వైసిపి హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం గడప తొక్కింది. విభజన సమస్యలు పక్కన పెట్టి.. ఈ గలాటా ఏమిటని ఇరుపక్షాలకు సూచించిన ధర్మాసనం.. రోజా తీరు విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ విధంగా ప్రభుత్వానిదే పైచేయి అంటున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ఎన్నోసమస్యలు ఎదుర్కొంటోంది. ఆర్థిక లోటు, కనీసం రాజధాని లేకపోవడం, కార్యాలయాలు లేవు.. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు పక్షాలు కలిసి వెళ్లాలని ధర్మాసనం సూచించింది. కేంద్రం నుంచి విభజన హామీలు కూడా చాలా అమలు కావాల్సి ఉంది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఇరువురికీ చెంపపెట్టే అయినప్పటికీ.. రోజా తీరును తప్పుబట్టడం టిడిపి విజయమంటున్నారు.