పేదవారింటి పెద్ద కొడుకునవుతా: చంద్రబాబు
అనంతపురం: పేదవారి ఇంటికి పెద్ద కొడుకులా వుండి కష్టపడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల అప్పును తన భుజాలపై వేసుకొని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ఇంతటి ఆర్థిక సంక్షోభంలోనూ పింఛన్లు, రుణమాఫీలు చేస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందించడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. లక్ష్యాన్ని సాధించేవరకు మళ్లీ మళ్లీ జిల్లా పర్యటనకు వస్తానన్న ఆయన ఎవరూ చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
తోటపల్లి నీటిని సీఎం చంద్రబాబు విడుదల చేస్తారు: మృణాళిని
విజయనగరం: తోటపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని జులై మూడో వారంలో ఏపి సిఎం చంద్రబాబు విడుదల చేస్తారని ఏపీ మంత్రి మృణాళిని తెలిపారు. జిల్లా డీఆర్డీఏ కార్యాలయంలో తోటపల్లి నిర్వాసితులు, అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు వస్తాయని చెప్పారు.
రైతుల అభిప్రాయాలు విన్న మృణాళిని.. సమస్యలు ఏమైనా వుంటే గనక సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రామారావు, ఎమ్మెల్సీ జగదీశ్, పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు, పార్వతీపురం ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు.