పొలిటికల్ వార్: కత్తులు దూసుకుంటున్న కెసిఆర్, చంద్రబాబు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య మరోసారి రాజకీయ యుద్ధం ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. ఇరువురు పరస్పరం విమర్సనాస్త్రాలు సంధించుకుంటున్నారు. దాదాపుగా ఒకరి పేరును మరొకరు ప్రస్తావించకుండానే మాటల ఈటెలు విసురుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల నేపథ్యంలో ఈ యుద్ధం ప్రారంభమైందని అనుకోవచ్చు.
డిసెంబర్లో జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే హైదరాబాదు, దాని పరిసరాల్లోని తమ పార్టీ శాసనసభ్యులకు కెసిఆర్ ఎర వేసి లాక్కుంటున్నారనే ఆగ్రహంతో చంద్రబాబు ఉన్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ వంటివారు ఇది వరకే టిఆర్ఎస్ గూటికి చేరుకోగా, తాగా రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు టిఆర్ఎస్లో చేరారు. దీంతో చంద్రబాబు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నట్లు కనిపిస్తున్నారు.
చంద్రబాబు సభ (ఫోటోలు)
మహబూబ్నగర్లో తెలంగాణ టిడిపి నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు కెసిఆర్పై తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. 2019లో తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దానికి ప్రతిగా హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీ ముగింపు ప్రసంగంలో కెసిఆర్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అయితే, ఈ ప్రసంగంలో ఆయన చంద్రబాబుపై తక్కువగా కాంగ్రెసు నేతలపై ఎక్కువగా విమర్శలు చేశారు. ఇది కూడా మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుపై అంత తక్కువ విమర్శలు చేయడమేమిటనే విషయంపై మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
కెసిఆర్ సభ (ఫోటోలు)
అయితే, అవి కెసిఆర్ దృష్టికి వచ్చాయి కాబోలు సోమవారం సాయంత్రం సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ మైదానంలో చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కిరికిరి బాబుగా అభివర్ణించారు. ఆయన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి, ఆయనకో రాజ్యం ఉంది, ఆయన రాజ్యం చూసుకోమనండి అంటూ కెసిఆర్ విరుచుకుపడ్డారు. రైతుల రుణమాఫీ, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు, డ్వాక్రా మహిళల రుణమాఫీ వంటి హామీల విషయంలో చంద్రబాబు ఎలా వ్యవహరించారనే విషయాన్ని ఎత్తి చూపుతూ తమ ప్రభుత్వం అవే సమస్యల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో కెసిఆర్ వివరించారు.
కెసిఆర్ విమర్శలకు సమాధానంగా చంద్రబాబు అదే రాత్రి తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి టిఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆ పదవిని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు అప్పగిస్తూ కెసిఆర్ను దుయ్యబట్టారు. టిఆర్ఎస్లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, తిరిగి పోటీ చేయించాలని ఆయన సవాల్ చేశారు.
ఇదే ఎన్టీఆర్ భవన్లో కూర్చుని కార్యకర్తలకు తెలుగుదేశం పాఠాలు చెప్పిన కొంతమంది వ్యక్తులు, ఇప్పుడు బయటకు వెళ్లి తిట్ల పురాణం విప్పుతున్నారని, ఏదేదో మాట్లాడుతున్నారని, తన దగ్గర పని చేసి, ట్రస్ట్ భవన్లో పాఠాలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు నీకిక్కడేం పని అని అంటున్నారని, వారి మాటలు మనసుకు బాధ కలిగిస్తున్నాయని ఆయన కెసిఆర్ను ఉద్దేశించి అన్నారు.
ఇరువురి మధ్య జిహెచ్ఎంసి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పెరిగే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలుగుదేశం పార్టీ, బిజెపి బలంగానే ఉన్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రామచందర్ రావు విజయం కూడా దాన్నే నిరూపిస్తోందని అంటున్నారు. టిడిపి బలాన్ని తగ్గించి, జిహెచ్ఎంసి ఎన్నికల్లో పాగా వేయాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులను టిఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇదే ఇరువురి మధ్య చిచ్చుకు కారణంగా కనిపిస్తోంది.