ట్విస్ట్: నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధం.. చంద్రబాబుదే ఆలస్యమా?
హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుండి రానున్న ఐదారు నెలల్లో నిధులు పొందవచ్చునని తెలుస్తోంది. ఏపీ రాజధాని నిర్మాణం నేపథ్యంలో అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలని కేంద్రం ఏపీకి లేఖ రాసిందని సమాచారం. అయితే, సింగపూర్ నుండి మాస్టర్ ప్లాన్ వచ్చాకనే.. రాజధాని ఖర్చు వివరాలు పూర్తి వివరాలు తెలుస్తాయి.
సింగపూర్ నుండి రాజధాని మాస్టర్ ప్లాన్ రానందున.. అది వచ్చాకే కేంద్రానికి పూర్తి వివరాలు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం సింగపూర్ సహకారం తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాజధాని మాస్టర్ ప్లాన్ సింగపూర్ ప్రభుత్వం తయారు చేస్తోంది. ఇటీవల సింగపూర్ మంత్రి షణ్ముగం హైదరాబాద్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. జూన్ నాటికి రాజధాని తొలి మాస్టర్ ప్లాన్ ఇస్తామని చెప్పారు.
మాస్టర్ ప్లాన్ వచ్చాక ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది. ఆ తర్వాతనే కేంద్రం ఇవ్వమన్న పూర్తి వివరాలు ఇచ్చేందుకు ఆస్కారముంటుందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం పంపిన వివరాలను కేంద్రం క్రాస్ చెక్ చేసుకుంటుంది. ప్రభుత్వం పంపిన వివరాలు సరైనవిగా నిర్ణయానికి వచ్చాక వాటిని విడుదల చేస్తుంది. ఈ ప్రాసెస్ కోసం మరో ఒకటి రెండు నెలలు తీసుకుంటుంది.
కేంద్ర ప్రభత్వం ఏపీ రాజధాని నిర్మాణం కోసం రూ.1,580 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో రూ.1000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసం, రూ.580 కోట్లు భవనాల నిర్మాణం కోసం. అయితే, కేంద్రం ఈ నిధులు విడుదల చేయడానికి.. మొదట ఏపీ ప్రభుత్వం పూర్తి వివరాలను పంపించవలసి ఉంటుంది.