'ఓటుకు నోటులో బాబు తప్పించుకోలేరు', 'ఇరికించేందుకు జగన్ కుట్ర'
విజయవాడ: ఓటుకు నోటు కేసు నుంచి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోను తప్పించుకోలేరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు బుధవారం నాడు అన్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తన పైన సిబిఐ ఛార్జీషీటు పెడితే తాను వెంటనే రాజీనామా చేశానని గుర్తు చేశారు. చంద్రబాబు కూడా ఇప్పుడు రాజీనామా చేయాలన్నారు.
బాబును ఇరికించాలనే కుట్ర: సోమిరెడ్డి
ఏదో విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ఇరికించాలని వైసిపి ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా ఆరోపించారు. చంద్రబాబుకు ఆ కేసుతో సంబంధం లేదని చెప్పారు.
ఆయనను ఈ కేసులో ముద్దాయిగా చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు. వైసిపి ఒక నేరస్తుల సమూహమని మండిపడ్డారు.
ఓటుకు నోటుపై మెమో: రేవంత్కు సమన్లు, బాబుని విచారిస్తాం! 'ట్యాపింగ్' వచ్చేనా?
చంద్రబాబుని ముద్దాయిని చేయడం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే కాలేదని అన్నారు. కాపుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. తల్లి, పిల్ల కాంగ్రెస్లు కుట్ర చేస్తున్నాయన్నారు. ఆ పార్టీలు ఆడుతోన్న ఆటలో కాపు నేత ముద్రగడ పద్మనాభం పావుగా మారారన్నారు.