ఏపీ స్థానికత-ఇబ్బందులు: రాజ్నాథ్కు బాబు లేఖ, జగన్ కోలుకోవాలి: రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు లేఖ రాశారు. రాజధానికి తరలి వచ్చే ఉద్యోగులు, ఇతర వర్గాల పిల్లలకు స్థానికతలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికతలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
జగన్ కోలుకోవాలన్న రఘువీరా రెడ్డి
ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మంగళవారం ఆకాంక్షించారు. జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసి, గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జగన్ త్వరగా కోలుకోవాలని రఘువీరా రెడ్డి ఆకాంక్షించారు. మరోవైపు, పోలవరం ప్రాజెక్టు వ్యయం రెట్టింపు కావడం పైన కూడా మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
విభజన చట్టం ప్రకారం పోలవరంను కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో నీరు కాకుండా, డబ్బు ప్రవహించిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు అంచనాలు రెట్టింపుపై ఆయన భగ్గుమన్నారు. దోచుకోవడానికే అంచనాలు రెట్టింపు అని పెంచుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం వెంటనే తన ఆధీనంలోకి తీసుకొని పూర్తి చేయాలన్నారు.
దీక్ష ఆరంభమే: విశ్వరూప్
జగన్ దీక్ష ఆరంభం మాత్రమేనని, దానిని భగ్నం చేయడం సరికాదని మాజీ మంత్రి, వైసిపి నేత విశ్వరూప్ అన్నారు. జగన్ దీక్షను భగ్ం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం అమలాపురంలో హైస్కూల్ సెంటర్ వద్ద మానవ హారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడారు. జగన్ హోదా కోసం ఏడు రోజులు దీక్ష చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. హోదా పైన పోరాడటంలో ఇది ఆరంభమే అన్నారు. కాగా, సోమవారం నాడు జగన్ పైన మంత్రులు కామినేని, పత్తిపాటి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రి, రాయదుర్గంలో వారి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.