ఆర్మీ ర్యాలీలో మరోసారి తొక్కిసలాట: పలువురు అభ్యర్థులకు గాయాలు
విశాఖపట్నం: నగరంలో శనివారం ఉదయం నిర్వహించిన ఆర్మీ ర్యాలీలో మరోసారి తొక్కిసలాట చోటు చేసుకుంది. శుక్రవారం కూడా తొక్కసలాట జరిగింది. కౌంటర్లు తక్కువగా ఏర్పాటు చేయడం వల్లనే తొక్కసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ తొక్కసలాటలో పలువురు అభ్యర్థులకు గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు అభ్యర్థులను చెరగొట్టేందుకు స్వల్ప లాఠీ ఛార్జీ చేశారు.
సరైన ఏర్పాట్లు చేయడంలో కమిషనర్ ఆదేశాలను ఆర్మీ అధికారులు బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 9వేల మందికిపైగా అభ్యర్థులు హాజరుకాగా, కేవలం మూడు కౌంటర్లే ఏర్పాటు చేశారు. భారీగా తరలివచ్చిన అభ్యర్థులను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారు. ఆ తర్వాత భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని సరిదిద్దారు.
ఆర్మీ ర్యాలీ కోసం విచ్చేసిన అభ్యర్థులకు నగరంలోని పోర్టు స్టేడియంలో శనివారం ఉదయం నుండి నెంబర్ వారీగా టోకెన్లను అందజేయనున్నట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఆరు జిల్లాల నుండి ఆర్మీ ర్యాలీలో ఎంపిక కోసం నగరంలోని వెలంపేటలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్దకు అధిక సంఖ్యలో అభ్యర్థులు చేరడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యమైంది.
దీంతో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పాటు పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు లాఠీచార్జీ చేయడం, అభ్యర్థులు గాయాలపాలవ్వడంతో ఆర్మీ, పోలీసు, ప్రభుత్వ అధికారులు చర్చించుకుని శుక్రవారం సాయంత్రం ఓ నిర్ణయానికి వచ్చారు. సీరియల్ ప్రకారం పోర్టు స్టేడియంలో శనివారం ఉదయం ఆరు గంటల నుండి అభ్యర్థులకు ఆర్మీ అధికారులు టోకెన్లు అందజేయ నున్నారు.
ఆర్మీ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థి, ఆ టోకెన్ను స్టేడియం బయట ఉన్న పోలీసులకు చూపిస్తే, వరుసగా ఒక్కో అభ్యర్థిని లోపలికి పంపిస్తారు. దీని వలన తొక్కిసలాట జరిగే అవకాశవుండదని అధికారులు భావిస్తున్నారు.