కెసిఆర్పై తిట్లకు రేవంత్ రెడ్డిపై చార్జిషీట్: టీ సచివాలయంలో జీవోల స్కామ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా రేవంత్ పై న్యాయవాది గోవర్ధన్ రెడ్డి ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రేవంత్ పై ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అందుకు సంబంధించిన చార్జిషీట్ను నాంపల్లి కోర్టుకు సమర్పించారు.
రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేయాలని కోర్టుకు పోలీసులు విన్నవించారు. దీంతో మరో రెండు మూడు రోజుల్లో రేవంత్ కు కోర్టు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. గత కొంత కాలంగా కెసిఆర్ను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, తెలంగాణ సచివాలయంలో నకిలీ జీవోల స్కామ్ బయటపడింది. తెలంగాణ సచివాలయంలోని ఆర్థిక శాఖ నుంచి నకిలీ జీవోలు జారీ అయినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో హైదరాబాద్ నగర నేర పరిశోధక బృందం (సిసిఎస్) పోలీసులు ఆరుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
బాధితులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించడంతో కుంభకోణం వెలుగు చూసింది. దీని వెనక ఎవరి హస్తం ఉందనే విషయంపై విచారణ సాగుతోంది.