చంద్రబాబు.. 48 డిగ్రీలు.. చెవిరెడ్డి చెప్పిన కథ
యాథృచ్చికమో.. చంద్రబాబు దురదృష్టమో గానీ.. ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే కరువు కోరలు చాచడం చంద్రబాబుకు వ్యక్తిగత ఇమేజ్ కి ఇబ్బందిగానే పరిణమించింది. ముఖ్యంగా చంద్రబాబుపై విరుచుకుపడే ప్రతిపక్షం వైసీపీ ఈ విషయంపై బాగానే ఫోకస్ చేసింది. సందర్భం దొరికిన ప్రతిసారి చంద్రబాబు వల్లే ఇదంతా అని ఆరోపిస్తోంది వైసీపీ.
తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్ది భాస్కర్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో ఇంతకుముందెన్నడూ 48 డిగ్రీల ఉష్ణోగ్రత చూడలేదని చెప్పిన చెవిరెడ్డి.. మహానుభావుడు చంద్రబాబు వల్లే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, ఈ పుణ్యమంతా ఆయనదేనని ఎద్దేవా చేశారు. ఆఖరికి ఎండల పేరు చెప్పుకుని చంద్రబాబు హెరిటేజ్ మజ్జిగను బాగానే అమ్ముకుంటున్నారన్నారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులను నివారించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ.. ఏపీలోని ఆర్డీవో, తహశీల్దారు కార్యాలయాల ఎదుట ప్రతిపక్షం వైసీపీ ధర్నాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా తహశీల్దారు కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న చెవిరెడ్డి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు, కరువు ఈ రెండు కవల పిల్లల్లా రాష్ట్రం మీద పడి జనాన్ని అల్లాడిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు సీఎం కుర్చీలో ఉంటే కరువు కూడా ఆయన వెంటే ఉంటుందన్న చెవిరెడ్డి.. నరకంలో కూడా జనం బతకవచ్చనే దానికి చంద్రబాబు పాలన నిదర్శనమన్నారు. రాయలసీమ ప్రజలు కరువుతో అల్లాడుతుంటే సమస్యలు పరిష్కరించాల్సిన చంద్రబాబు మాత్రం విదేశాల్లో చక్కర్లు కొట్టి వస్తున్నారన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు చెవిరెడ్డి.