'కేసు, సూట్ కేసు. లోకేష్..' ఇదే బాబు రాజకీయం, 'యనమలకు తలకాయ ఉందా?'
చిత్తూరు : అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తన అతి దారుణంగా ఉందంటూ టీడీపీ సభ్యులు చేస్తోన్న వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబు రాజకీయాలను తప్పుబడుతూ.. 'కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో డీజీపీ ఉంటే చాలు' అన్న చందంగా చంద్రబాబు రాజకీయాలు తయారయ్యాయని ఎద్దేవా చేశారు చెవిరెడ్డి. 'ఓటుకు నోటు నుంచి గట్టెక్కించేందుకు బీజేపీ, ఎదురు ప్రశ్నించిన వాళ్లను లోపలేసేందుకు డీజీపీ ఉంటే చాలు..'అన్న తరహాలో చంద్రబాబు రాజకీయాలు ఉన్నాయని విమర్శించారు.
చంద్రబాబు రాజకీయమంతా మూడింటి మధ్యే నడుస్తోందని చెప్పుకొచ్చిన చెవిరెడ్డి.. 'కేసు, సూట్ కేసు, లోకేష్..' ఈ మూడింటితోనే చంద్రబాబు రాజకీయం ముడిపడి ఉందని ఆరోపించారు. ఇక యనమల గురించి ప్రస్తావిస్తూ.. స్పీకర్పై వైసీపీ సభ్యులు దాడి చేశారని యనమల రామకృష్ణుడు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. 37 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నానని చెప్పుకునే యనమల.. వ్యాఖ్యలు చేసేముందు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు.
సెక్రటరీ మెడకు వైర్ చుట్టి చంపామని యనమల ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు చెవిరెడ్డి. అసలు యనమలకు తలకాయ ఉండే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. సెక్రటరీపై దాడి చేయాల్సిన అవసరం తమకేముంటుందని నిలదీశారు.
ఎన్టీఆర్ అసెంబ్లీ నుంచి వెళుతున్నప్పుడు.. టపాసులు కాల్చుకుని ఆనందించిన వ్యక్తులు.. ఇప్పుడు స్పీకర్ చైర్ గురించి మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. కనీసం అసెంబ్లీలో ఎన్టీఆర్ కు మాట్లాడే అవకాశం కూడా చేసిన వ్యక్తి యనమల అని గుర్తు చేశారు చెవిరెడ్డి. నిరసన తెలపడానికి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడం పార్లమెంట్ లోను జరుగుతోందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.