పవన్! వారిని ప్రశ్నించు: జగన్ పార్టీ, రాజధాని ప్రాంతంలో రేపు జనసేన చీఫ్
చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలను నిలదీయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆదివారం అన్నారు. బడ్జెట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు.
పదవుల కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీ బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన టీడీపీ, బీజేపీలను పవన్ కళ్యాణ్ నిలదీయాలన్నారు.
రేపు రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటన
పవన్ కళ్యాణ్ సోమవారం నాడు తుళ్లూరులో పర్యటించే అవకాశాలున్నాయి.. ఢిల్లీ పర్యటనకు ముందే పవన్ రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడాలనుకుంటున్నారు. రైతుల సమస్యలు నేరుగా వింటే వాటి గురించి ఢిల్లీలో కూడా మాట్లాడవచ్చునని భావిస్తున్నారు.
టీడీపీపై బీజేపీ నేత ఆగ్రహం
రాజధాని అంశంపై టీడీపీ నేతల తీరు పైన బీజేపీ రాష్ట్ర నేత శ్యాంకిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పూర్తి కాకుండానే కేంద్రం రాజధానికి నిధులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. అసెంబ్లీ, సచివాలయం సహా ఏ బిల్డింగ్ ఎక్కడ కడతారో ఇంతవరకు చెప్పలేదన్నారు. ఢిల్లీలో బీజేపీ ఓడిపోతే టీడీపీ నేతలు ఫేస్బుక్లో పండుగ చేసుకున్నారని ఆరోపించారని తెలుస్తోంది.