కెసిఆర్ది క్రిమినల్ మైండ్, బాబు లింక్ లేదు: మంత్రి
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుది క్రిమినల్ మైండ్ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప వ్యాఖ్యానించారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలను ఏం చేయడానికైనా కేసీఆర్ వెనుకాడటం లేదని మండిపడ్డారు. తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వ్యవహారంతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రేవంత్ను కావాలనే ఇరికించారని చినరాజప్ప ఆరోపించారు.
కాంగ్రెస్ స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ర్టాన్ని విడగొట్టిందని, అప్పులను మనకు మిగిల్చారని మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మంగళవారం నర్సీపట్నంలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో అయ్యన్న పాల్గొన్నారు. అలాగే అనకాపల్లిలో నవనిర్మాణ దీక్షలో ఎంపీ అవంతి పాల్గొన్నారు.
అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద చేపట్టిన నవనిర్మాణ దీక్షలో మంత్రులు సునీత, పల్లెరఘనాథ్రెడ్డి, పలువురు మ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ చమన్, మేయర్ పాల్గొన్నారు. రాష్ర్టాన్ని విభజించిన కాంగ్రెస్కు ప్రజలు బుద్ధిచెప్పారని ఈ సందర్భంగా సునీత అన్నారు.