ఏపీలోనూ డ్రగ్స్ సరఫరా అవుతోంది: చినరాజప్ప సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు సమాచారం ఉందని హోంశాఖ మంత్రి చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డ్రగ్స్ మాఫియాలో పలు స్కూల్ పిల్లల నుంచి కొందరు సినీ ప్రముఖుల.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు సమాచారం ఉందని హోంశాఖ మంత్రి చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డ్రగ్స్ మాఫియాలో పలు స్కూల్ పిల్లల నుంచి కొందరు సినీ ప్రముఖుల వరకు బానిసయ్యారనే వార్తలు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో చినరాజప్ప ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి స్మగ్లింగ్పై చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక బృందాలతో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టనున్న పాదయాత్ర గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
పోలీసుల అనుమతి తీసుకుని ముద్రగడ పాదయాత్ర చేయాలని చినరాజప్ప అన్నారు. అసలు పాదయాత్రపై ముద్రగడకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే ముద్రగడ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
మంజునాథ కమిషన్ నివేదిక ఆలస్యమైందని, దీనిపై మంగళవారం కేబినెట్లో చర్చిస్తామని చినరాజప్ప తెలిపారు. నాగావళి, వంశధారకు భారీగా వరద నీరు వచ్చిందని, దీంతో విజయనగరం ప్రాంతానికి వరద ముప్పు ఎక్కువగా ఉందని తెలిపారు. సహాయక చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.