సీరియల్ ఎఫెక్ట్, చిన్నారి పెళ్లి కూతురు: తల్లిపై కోపంతో పక్కింటి వ్యక్తిని పెళ్లాడిన బాలిక
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో షాకింగ్. ఓ చిన్నారి పెళ్లి కూతురు అయింది. టీవీ సీరియల్ ప్రభావంతో, తల్లిదండ్రుల పైన కోపంతో 12 ఏళ్ల చిన్నారి పక్కింట్లో ఉండే 24 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం నాడు వెలుగులోకి వచ్చింది.
విశాఖ జిల్లాలో లక్ష్మీ, అప్పారావులు కూలీ పని చేసి బతుకుతున్నారు. వారికి నలుగురు అమ్మాయిలు. చివరి కూతురు చదువు పైన ఆసక్తి చూపించకపోయేది. దీంతో, తల్లి ఆమెను మందలించేది.
ఓ వైపు తల్లిదండ్రులు కోప్పడటం, మరోవైపు సీరియల్ ప్రభావంతో ఆ బాలిక పక్కింట్లో ఉండే బంగారు అప్పన్న అనే యువకుడిని పెళ్లాడింది. తల్లి కోప్పడుతుండటంతో అప్పన్న ఆమెను ఓదార్చుతుండేవాడు. దీంతో, వారి మధ్య స్నేహం, ఆ తర్వాత ప్రేమ ఏర్పడింది.
ఆమెను యలమంచిలి సమీపంలోని ఓ గుడిలో అప్పన్న పెళ్లి చేసుకున్నాడు. సోమవారం ఆమె మెడలో తాళితో పాఠశాలకు వచ్చింది. విద్యార్థులు ఆరా తీయడంతో ఆమె విషయం చెప్పింది. ఈ విషయాన్ని వారు హెడ్మాస్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు.
ఆయన తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్పన్నను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి పెద్దలుగా వ్యవహరించిన ముగ్గురు విద్యార్థులను మందలించారు. కాగా, పెళ్లైన తర్వాత విజయవాడ పారిపోదామనుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక తాను అత్తింట్లో ఉండి చదువుకుంటానని చెబుతోంది.