ఇక టీడీపీతో వద్దు: అమిత్ షాతో బీజేపీ నేతల మొర, పార్టీలో చేరిన చిన్నికృష్ణ
తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతో నష్టపోతోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఏపీ బీజేపీ నేతలు మొరపెట్టుకున్నారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతో నష్టపోతోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఏపీ బీజేపీ నేతలు మొరపెట్టుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి అమిత్ షా విజయవాడకు చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అమిత్ షాను కలిసిన పలువురు బీజేపీ నేతలు తమ అభిప్రాయాన్ని ఆయనకు తెలిపారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పొత్తు వ్యవహారాలను చర్చిస్తూ, ఇటీవలి కాలంలో బీజేపీపై తెలుగుదేశం నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
పొత్తు వద్దనుకునే విధంగా వారు మాట్లాడుతున్నారని, పొత్తు కారణంగా బీజేపీతో పోలిస్తే, తెలుగుదేశమే లాభపడిందన్న విషయాన్ని వారు మరచిపోయారని ఫిర్యాదు చేశారు. పలువురు నేతలతో అమిత్ షా విడివిడిగా సమావేశం కాగా, అందరూ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం.
కాగా, అమిత్ షాను రాజధాని ప్రాంత రైతులు కూడా కలిశారు. వన్ టైం సెటిల్ మెంట్ గడువును పొడిగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్ సా.. ఈ విషయాన్ని ఆర్థిక శాఖతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.
ఏపీలో పర్యటించిన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభులతో కలిసి అమిత్ షా.. ఏపీలోని అన్ని జిల్లాలకు అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు.
బీజేపీలో చేరిన చిన్నికృష్ణ
ప్రముఖ టాలీవుడ్ సినీ రచయత చిన్నికృష్ణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్ లు బీజేపీలో చేరారు. అమిత్ షా విజయవాడకు వచ్చిన సందర్భంగా... వీరిద్దరూ ఆయన సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ రూపంలో గాంధీ మళ్లీ పుట్టాడనిపిస్తోందని కొనియాడారు. మోడీ పాలన చూసే తాను బీజేపీలో చేరినట్లు తెలిపారు.