కాంగ్రెసు సమావేశం: చిరంజీవి, బొత్స గైర్హాజర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యవర్గ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు. శనివారంనాడు జరిగిన ఈ సమావేశానికి ఎఐసిసి పరిశీలకుడు కుంతియాతో పాటు ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి, కెవిపి రామచందర్ రావు తదితరులు హాజరయ్యారు. ఆంద్రరత్న భవన్లో ఈ సమావేశం జరిగింది.
తెలుగు రాష్ట్రాలు గొడవపడితే లాభపడాలని కేంద్రం చూస్తోందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. బిజెపి రాజకీయ లబ్ధి కోసం చూడడం సరికాదని ఆయన అన్నారు. సమావేశం ముగిసిన తర్వాత రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడారు
ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో మేధో మథన సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నేరం చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ చోద్యం చూస్తోందని ఆయన అన్నారు. విభజన బిల్లు అమలుకు ఫిబ్రవరి 6 నుంచి 20వ తేదీ వరకు కోటి సంతకాల సేకరణ జరపనున్నట్లు ఆయన తెలిపారు.
చిరంజీవి, బొత్స సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణాలు తెలియడం లేదు. తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను గతంలో బొత్స సత్యనారాయణ ఖండించారు.