పవన్ కన్నా చిరు బెటర్, వచ్చే ఎన్నికల్లో జనసేన ఎఫెక్ట్ ఉండదు: రోజా
పవన్ కళ్యాణ్ కన్నా ఆయన సోదరుడు చిరంజీవే మేలని అన్నారు. ప్రజారాజ్యం స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని సీట్లయినా గెలిచారని చెప్పారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. పార్టీ స్థాపించి మూడేళ్లు గడిచినా.. ఆయన సాధించిందేమిటని ప్రశ్నించారు. తప్పు జరిగితే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్.. మోడీ, చంద్రబాబులకు జై కొడుతూ సైలెంట్ గా కూర్చున్నారని ఎద్దేవా చేశారు.
జనసేన పార్టీ స్థాపించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయలేదని రోజా విమర్శించారు. అదే సమయంలో చిరంజీవి గురించి కూడా రోజా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ కన్నా ఆయన సోదరుడు చిరంజీవే మేలని అన్నారు. ప్రజారాజ్యం స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని సీట్లయినా గెలిచారని చెప్పారు.
ఓ టీవి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొత్త కాకపోయినా.. పార్టీ స్థాపించి ఆయన చేసిందేమి లేదన్నారు రోజా. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రభావం చూపించలేరని అన్నారు.
మావాళ్ల దాడి చాలా చిన్న విషయం: చీఫ్ విప్ కాల్వ
రవాణ శాఖ అధికారి కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు చేసిన హంగామాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా.. అధికార పార్టీ మాత్రం విషయాన్ని వీలైనంత త్వరగా సద్దుమణిగించే ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు 'అసలు ఆ దాడి చాలా చిన్న విషయం' అని వ్యాఖ్యానించడం గమనార్హం. నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిన్న విషయాన్ని వైసీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. తమ నేతలు ఇప్పటికే రవాణ శాఖ అధికారికి క్షమాపణలు చెప్పారని, ఇక్కడితో వివాదం ముగిసిపోయిందని గుర్తు చేశారు.
అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అధికారుల పట్ల టీడీపీ నేతల వ్యవహార శైలి కక్ష్య సాధింపు ధోరణిలా ఉందన్నారు. అధికార పార్టీ నేతల తీరు రౌడీయిజాన్ని తలపించేలా ఉందని, రోజురోజుకూ అధికారులపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు.