చిరంజీవి సేవలను వినియోగించుకోండన్న రాహుల్: త్వరలో పార్టీ క్రియాశీల బాధ్యతలు..!
హైదరాబాద్: ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం పర్యటన విజయవంతమైన సంగతి తెలిసిందే. రాహుల్ పర్యటన ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాహుల్ అనంతపురం పర్యటనలో రాహుల్ కంటే కాంగ్రెస్ నేత, సినీ నటుడు చిరంజీవితోనే కార్యకర్తలు చేతులు కలిపేందుకు పోటీ పడ్డారు.
తన పర్యటనలో చిరంజీవికి ప్రజల్లో ఉన్న క్రేజ్ను గుర్తించిన రాహుల్ గాంధీ, పార్టీ పునర్నిర్మాణంలో ఆయన సేవలను వినియోగించుకోవాలని తీర్మానించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చిరంజీవి క్రియాశీలంగా వ్యవహరించేలా చూడాలని ఏపీసీసీ వర్గాలకు సూచించారట.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నంగా ఎన్నిసార్లు పిలిస్తే అన్ని సార్లు ఇక్కడికి వచ్చేందుకు రాహుల్ గాంధీ కూడా అనంత పర్యటనలో సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్ పార్టీలో చిరంజీవికి ముఖ్య బాధ్యతలు అప్పజెప్పి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచించాలని సూచించారని తెలుస్తోంది.
విభజనపై క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదని కూడా అన్నారు. విభజన విషయంలో ఆత్మ రక్షణలో పడకుండా ఎదురు దాడితోనే పార్టీని ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంప్రదాయ ఓటుబ్యాంకు చెదిరిపోవడానికి కారణాలను అన్వేషించి, అందుకు చిరంజీవి లాంటి వారిని వినియోగించుకోవాల్సిందిగా సూచించారట.
ఏపీ విభజనలో కాంగ్రెస్ ఎటువంటి తప్పూ చేయలేదని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంత పర్యటనలో తేల్చి చెప్పారు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం మానేసి, భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిందిగా పార్టీ వర్గాలకు సూచించారు. అంతేకాదు అన్ని పార్టీలు కోరితేనే రాష్ట్ర విభజన జరిగిందన్న విషాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయారని కూడా అన్నారు.
విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర పేరిట పది కిలోమీటర్లు పాదయాత్ర చేసి, రైతలను, డ్వాక్రా మహిళలను, విద్యార్ధులను పరామర్శించారు.