నో ఎంట్రీ: చిరంజీవికి నో చెప్పిన పవన్ కళ్యాణ్! పీఆర్పీ ఎపెక్ట్.. జనసేన జాగ్రత్త
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు, కాంగ్రెస్ నేత చిరంజీవితో కలిసి పని చేసే అవకాశాలున్నాయా? అనే చర్చ చాలాకాలంగా సాగుతోంది. దీనిపై పవన్ సూటిగా సమాధానం చెప్పారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు, కాంగ్రెస్ నేత చిరంజీవితో కలిసి పని చేసే అవకాశాలున్నాయా? అనే చర్చ చాలాకాలంగా సాగుతోంది. దీనిపై పవన్ సూటిగా సమాధానం చెప్పారు.
అన్నయ్య చిరంజీవి, తాను కలిసి పని చేసే అవకాశాలు లేవని చెప్పారు. కలిసి పని చేయాలని తమ ఇద్దరికీ లేదని చెప్పారు. తమ ఆలోచనలు వేరు అని, ఇద్దరివి భిన్నమైన దారులు అని పవన్ చెప్పారు. విరుద్ధ భావాల నేపథ్యంలో చిరుకు ఓ విధంగా జనసేనలోకి నో ఎంట్రీ అని చెప్పినట్లయిందంటున్నారు.
కొద్ది రోజుల క్రితం నాగబాబు మాట్లాడుతూ.. తాను 2019 ఎన్నికల్లో పని చేయాల్సి వస్తే తమ్ముడి పార్టీ అయిన జనసేన కోసమే పని చేస్తానని చెప్పారు. అన్నయ్య చిరంజీవి కూడా పవన్కు మద్దతిస్తాడని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు పవన్ మాత్రం.. చిరు దారి, తన దారి వేరని, మాకు పొంతన కుదరదని చెప్పేశారు.
వ్యక్తిగత అజెండాలతో ప్రజారాజ్యం పార్టీలోకి
ప్రజారాజ్యం అనుభవం చూశానని, అందుకే జనసేన నిర్మాణంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నానని పవన్ కళ్యాణ్ మంగళవారం నాటి ప్రెస్ మీట్లో చెప్పారు. రకరకాల పార్టీల నుంచి పలువురు నాయకులు ఆనాడు ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారని, వ్యక్తిగత అజెండాలతో ముందుకు వచ్చారన్నారు.
జనసేనలోకి తీసుకునే వారిపై పవన్ జాగ్రత్తలు
ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీకి అనుభవంఉన్నవారు అవసరమే. ఎంతమందిని, ఎలాంటివారిని అన్నది ప్రజల సమస్యలపై అవగాహన ఆధారంగా తీసుకుంటా
మోడీ మోసం చేశారని అనుకోవడం లేదు
ప్రభుత్వాల పని తీరును బట్టి నిర్మాణాత్మక విమర్శలు చేయడమే తన విధానం అని పవన్ చెప్పారు. తాను ప్రజలకు అనుకూలమని, ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేశారని అనుకోవడం లేదన్నారు. అధికారంలోకి వచ్చినవారు హామీల అమల్లో ప్రజలకు బాధ్యులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుభవం ఉందని, మెగా ఆక్వా ఫుడ్ పార్కు వల్ల కాలుష్యం ఉండదన్న విషయాన్ని నిరూపించాల్సిన బాధ్యత ఉందన్నారు.
అనంతపురం జిల్లా నుంచి పోటీ
జనసేన పార్టీ నిర్మాణాన్ని జూన్ నుంచి ప్రారంభించి, వచ్చే మార్చికల్లా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపొందిస్తామని పవన్ చెప్పారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతానని చెప్పారు.
యువతకు పెద్దపీట
వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తామని, 60 శాతానికిపైగా సీట్లు వారికే కేటాయిస్తామని పవన్ తెలిపారు. వ్యవసాయం, భూసేకరణ, గనుల తవ్వకం వంటి 32 అంశాలను గుర్తించామని.. వీటిపై ప్రజల అభిప్రాయాల్ని వెబ్సైట్ ద్వారా తీసుకుంటామన్నారు. మూడేళ్ల ప్రస్థానంలో చేయగలిగినవి చేశామన్నారు. అనుకున్న స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయినప్పటికీ, స్ఫూర్తిని కొనసాగించగలిగామని, శక్తిని సమకూర్చుకుంటున్నామన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు ఉంటాయా
వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు ఉంటాయా? లేదా? అన్నదానిపై ఇప్పుడేమి ఆలోచించడం లేదని పవన్ చెప్పారు. ముందు పార్టీ నిర్మాణమని, ఆ తర్వాతే పొత్తు అవసరమా? లేదా? అన్న దానిపై స్పష్టత వస్తుందని తెలిపారు. వామపక్షాలకు బలమైన నిర్మాణం ఉందని, వారితో కలిసి పని చేయాలంటే మా పార్టీ నిర్మాణం కూడా జరగాలన్నారు.
ప్రత్యేక హోదా ఉద్యమానికి అందుకే బ్రేక్
జనసేన పట్ల ఆకర్షితులవుతున్న యవతను రాజకీయాల్లోకి రప్పించే విధానాల గురించి ఆలోచిస్తున్నామని పవన్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటానికి విద్యార్థులకు పరీక్షల దృష్ట్యా కొంతకాలం విరామమిచ్చానని, విద్యార్థి సంఘాల నాయకుల వచ్చి తనను కలిసి మే వరకు పరీక్షలు ఉంటాయని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.