చెవిరెడ్డి వ్యంగ్యాస్త్రం: బాబుకు ఇద్దరు వారసులు, 'నారా సిద్దార్థ్' కూడా!..
సీఎం చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో ఇద్దరు వారసులు ఉన్నారని.. ఒకరు నారా లోకేష్ అయితే మరొకరు నారా సిద్దార్థ్ అని చెవిరెడ్డి వ్యంగ్యాస్త్రం సంధించారు.
తిరుపతి: చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ మంత్రి నారా లోకేష్ కు బినామీగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఒకవిధంగా కలెక్టర్ సిద్దార్థ్ జైన్, నారా సిద్దార్థ్ గా మారిపోయారని, టీడీపీకి తొత్తులా వ్యవహరించడమే ఆయన పనిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
సీఎం చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో ఇద్దరు వారసులు ఉన్నారని.. ఒకరు నారా లోకేష్ అయితే మరొకరు నారా సిద్దార్థ్ అని చెవిరెడ్డి వ్యంగ్యాస్త్రం సంధించారు. ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి లోకేష్ కు బినామీగా, చంద్రబాబు ఆస్తులకు సంరక్షకుడిగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు.
తనకు బినామీగా వ్యవహరిస్తున్నందువల్లే కలెక్టర్ తీరు మీద ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లా స్థితిగతులపై అసెంబ్లీకి సైతం తప్పుడు నివేదికలు పంపినా.. సీఎం చంద్రబాబు కలెక్టర్ పై కనీసం విచారణ కమిటీని కూడా వేయలేకపోయారని మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు బినామీగా వ్యవహరించడమే తప్ప ప్రజా సమస్యలను కలెక్టర్ పట్టించుకోవడం లేదని చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన జిల్లా స్థాయి సమావేశాలను తొమ్మిది నెలలకు ఒకసారి కూడా నిర్వహించడం లేదని తెలిపారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లే వ్యవహరిస్తోందన్నారు.
సిద్దార్థ్ మీద అంత ప్రేమ ఉంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జిల్లాలోనే ఉండేలా చూసుకోవాలని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇలాంటి నిజాయితీ లేని కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు ఇక తాను వెళ్లేది లేదని ఆయన తెగేసి చెప్పారు. ఈ నెల 30లోపు సిద్దార్థ్ ను జిల్లా నుంచి బదిలీ చేయాలని లేనిపక్షంలో మే 1న జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు.