సిటీ స్క్వేర్కు బాబు ఆమోదం: విజయవాడ స్వరూపాన్నే మార్చనుందా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా సేవలందిస్తోన్న విజయవాడ నగరానికి కొత్త శోభ సంతరించుకోనుంది. ఇప్పటికే నగంరలో పలు సుందరీకరణ పనులు, నూతన భవనాల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం, ఓ ప్రతిష్ఠాత్మకమైన భారీ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసింది.
ఈ భారీ ప్రాజెక్టు పేరు 'విజయవాడ సిటీ స్క్వేర్'. నగరం నడిబొడ్డున స్వరాజ్ మైదాన్ (పీడబ్ల్యూడీ) గ్రౌండ్స్లో ఈ సిటీ స్క్వేర్ను నిర్మించనున్నారు. చైనా సంస్థ జీఐఐసీ రూపొందించిన సిటీ స్క్వేర్ డిజైన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.
విజయవాడకే కాకుండా రాష్ట్రం మొత్తానికే సిటీ స్క్వేర్ ఒక ఐకానిక్ భవంతిగా ఈ నిర్మాణంగా వెలుగొందుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టు అభివృద్ధి దశలవారీగా జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు రూ.135 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
సిటీ స్క్వేర్ భవంతిలో దుకాణ సముదాయాలతో పాటు సమావేశ మందిరాలను నిర్మిస్తారు. ఎగ్జిబిషన్లను కూడా నిర్వహించుకునే వెసులుబాటుని కల్పిస్తున్నారు. కాగా, స్వరాజ్య మైదాన్లో ఉన్న నిర్మాణాలను తొలగించి మొత్తం స్థలంలో సిటీ స్క్వేర్ ప్రాజెక్టు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు.
విజయవాడలో సిటీ స్క్వేర్
ఆదివారం ఉదయం సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు, విజయవాడ మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్, జీఐఐసీ ప్రతినిధులు పాల్గొన్నారు. 'సిటీ స్క్వేర్' నిర్మాణంలో ప్రభుత్వంపై ఎలాంటి వ్యయ భారం పడబోదని సీఎంకు అధికారులు వివరించారు.
విజయవాడలో సిటీ స్క్వేర్
ప్రస్తుతం స్వరాజ్ మైదానంలో ఉన్న భవనాలు, రైతు బజార్ను తొలగిస్తే ఇదివరకటికంటే ఎక్కువ స్థలం అందుబాటులోకి రానుంది. స్వరాజ్య మైదానంలో ఉన్న రైతు బజార్ను అలంకార్ థియేటర్ సమీపంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించే మోడల్ రైతు బజారుకు తరలించనున్నారు.
విజయవాడలో సిటీ స్క్వేర్
అక్కడ ఏర్పాటు చేయనున్న రైతు బజారులో 350 స్టాళ్లను అత్యంత ఆధునాతన రీతిలో ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సిటీ స్క్వేర్ నిర్మాణం పూర్తయితే పర్యాటకులకు ఇదొక ప్రధాన ఆకర్షణగా మారుతుంది.
విజయవాడలో సిటీ స్క్వేర్
ప్రస్తుతం తాత్కాలికి రాజధానిగా సేవలందిస్తోన్న విజయవాడలోని సీఎం క్యాంపు ఆఫీస్, స్టేట్ గెస్ట్ హౌస్, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ భవనాలకు సమీపంలోనే ఈ స్వరాజ్ మైదాన్ ఉండటం విశేషం. గత కొన్ని దశాబ్ధాలుగా ఎన్నో ఎగ్జిబిషన్లు, పుస్తకాల ప్రదర్శనకు ఈ స్వరాజ్ మైదాన్ ఆతిథ్యమిచ్చింది.