విమానం ఆలస్యం: క్షమాపణ చెప్పిన అశోక్, తెలియదన్న కిరణ్
ఢిల్లీ: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఘటన పైన కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కాశ్మీర్ వెళ్లిన కేంద్రమంత్రి రిజిజు నిర్వాకం కారణంగా ఎయిర్ ఇండియా విమానాలు సుమారు గంటసేపు ఆలస్యంగా నడిచాయని వార్తలు వచ్చాయి.
దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఢిల్లీలో మాట్లాడుతూ.. క్షమాపణలు చెప్పారు. ప్రజల్లోకి వెళ్లిన సమాచారం ప్రకారం చూస్తే ఈ అంశం ప్రతివాదనకు తావులేదన్నారు. అసలు జరిగిందేమిటో తెలుసుకుంటానని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. పీఎంవో వివరాలు అడిగిందన్నారు.
మోడీ ఆగ్రహం
కిరణ్ రిజిజు, దేవేంద్ర ఫడ్నవీస్ కారణంగా విమానాలు ఆలస్యం పైన వార్తలు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని పీఎంవో అడిగింది.
రిజిజుకు తెలియకుండానే...
తన గురించి ముగ్గురిని కిందకు దించిన సంఘటన తనకు తెలియదని కిరణ్ రిజిజు తెలిపారు. తనకు తెలియకుండానే జరిగిందన్నారు. తనకు తెలియకుండా జరిగినప్పటికీ ఆయన క్షమాపణలు చెప్పారు.
కాగా, ఫడ్నవీస్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ డిమాండ్ చేశారు. 200 మంది ప్రయాణీకుల ఇబ్బందికి కారణమయ్యారన్నారు. సాంకేతిక, భద్రతా సమస్యల కారణంగా ఆలస్యం కావొచ్చని, కానీ రాజకీయ నేతల కారణంగా అలా జరగవద్దన్నారు.
మహారాష్ట్రకు పెట్టుబడులు ఆహ్వానించి నిమిత్తం అధికార బృందంతో విదేశీ పర్యటనకు బయల్దేరిన ఫడ్నవీస్, పాస్ పోర్టు మర్చిపోయిన సందర్భంగా ఎయిర్ ఇండియా విమానం గంట ఆలస్యమైందనే వార్తలు వచ్చాయి.