క్లియర్: చంద్రబాబు, మోడీలతో కటీఫ్, కామ్రేడ్లతో పవన్ కల్యాణ్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వామపక్షాలతో చేయి కలుపుతున్నట్లు స్పష్టమైంది. పవన్ కల్యాణ్తో సిపిఐ నేత రామకృష్ణ గురువారంనాడు సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత తన వైఖరిని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నూతన సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. తన పార్టీని పూర్తి స్థాయిలో వ్యవస్థీకరించడంపై దృష్ి పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వామపక్షాలతో కలిసి నడవడానికి సిద్ధమైనట్లు స్పష్టమమవుతోంది.తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి, బిజెపికి కటీఫ్ చెప్పినట్లేనని చెప్పవచ్చు.
పోటీ ప్రకటన-షాకింగ్ సర్వే: దూరానికి టిడిపి సంకేతాలా, పవన్కు హెచ్చరికనా?
సిపిఐ నాయకులు రామకృష్ణ, చంద్రశేఖర రావు గురువారంనాడు హైదరాబాదులో పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు. సమావేశానంతరం పవన్ కల్యాణ్ తన వైఖరిని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
తన పార్టీ భావజాలం వామపక్షాలకు దగ్గరగా ఉంటుందని చెప్పారు. ప్రత్యేక హోదాపై, రాష్ట్రాభివృద్ధి అంశాలపై సిపిఐ నేతలతో చర్చించినట్లు ఆయన తెలిపారు. సిపిఎం నేతలతోనూ త్వరలో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. సిపిఎం, సిపిఎం, జనసేన నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటాయని ఆయన చెప్పారు. జనసేన సిద్ధాంతాలు వామపక్షాల సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయని రామకృష్ణ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న పవన్ కల్యాణ్ కామ్రేడ్లతో కలిసి నడవాడానికి సిద్ధపడినట్లు తాజా పరిణామం తెలియజేస్తోంది. చాలా కాలంగా జనసేన ఏ పార్టీతో వెళ్తుందనే ఉహాగానాలు చెలరేగుతున్నాయి. తాజా పరిణామంతో ఆ ఊహాగానాలకు తెరపడినట్లే.