'అమరావతి కోసం రాయలసీమను లూటీ చేస్తున్న చంద్రబాబు'
అనంతపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రాయలసీమను మొత్తం లూటీ చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మండిపడ్డారు. సీమలోని విలువైన ఖనిజ సంపదను అమరావతి కోసం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు రాయలసీమకు ఏం చేయలేదన్నారు. పైగా తమ సంపదను తీర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. కర్నూలులోని రాయలసీమ స్టూడెంట్స్ ఫెడరేషన్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి సోమవారం నాడు మాట్లాడారు.
హైదరాబాదులో నివసిస్తున్న ఏపీ వాళ్లు, ఇతర సెటిలర్లు సంతోషంగానే ఉన్నారని, కానీ రాయలసీమలోని ప్రజలు మాత్రం నవ్యాంధ్రలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాయలసీమ వారిని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.
నవ్యాంధ్రలో మనల్ని వలసవాళ్లుగా చూస్తున్నారని, వెనుకబడిన తమ ప్రాంతాల్ని పట్టించుకోవడం లేదన్నారు. విభజన సమయంలో రాయలసీమ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏం పథకాలు, ప్యాకేజీలు ఇవ్వలేదన్నారు. ఇలాంటప్పుడు కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని, ఉద్యోగ ఉపాధి కల్పన ఎలా లభిస్తుందని ప్రశ్నించారు.
రాయలసీమ బాగుపడాలంటే ప్రత్యేక రాయలసీమ ఒక్కటే అసలైన పరిష్కారమని చెప్పారు. రాయలసీమను చంద్రబాబు అమరావతి కోసం లూటీ చేస్తున్నారని, దాని నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. కర్నూలు జిల్లాలోని మహాయోగీ లక్ష్మవ్వ స్వగ్రామం మూసపల్లి నుంచి ఫిబ్రవరి 14 నుంచి రాయలసీమ చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.