'అదే లక్ష్యం.. ప్రపంచంలోని ఐదు గొప్ప నగరాల సరసన అమరావతి'
రాబోయే రోజుల్లో ప్రపంచంలోని ఐదు గొప్ప నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండేలా తీర్చిదిద్దుతామని, అదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన అంతర్జాతీయ వర్క్ షాపులో పాల్గొని ప్రసంగించారు. మేథో సంపత్తి, వాణిజ్యపరమైన అంశాలే ప్రధానంగా ఈ వర్క్ షాపును నిర్వహించారు.
ఈ సందర్బంగా రాష్ట్రంలో వాణిజ్య స్థితి గతుల గురించి సీఎం తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని ఐదు గొప్ప నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండేలా తీర్చిదిద్దుతామని, అదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని అన్ని శాఖల్లో పనితీరును అంచనా వేస్తున్నామని చెప్పారు.
ఆక్వా కల్చర్ రంగంలో రాష్ట్రంలో ప్రతీ ఏటా 30శాతం వృద్ధి సాధిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అవి ఎంతోకాలం ఉండబోవన్నారు. అమరావతి నుంచే విదేశాలకు బౌద్ధ ధర్మం వ్యాపించందని ఈ సందర్భంగా చంద్రబాబు పునరుద్ఘాటించారు.
ఫైబర్ గ్రిడ్ ద్వారా 15ఎంబీపీఎస్ వేగంతో ప్రజలకు రూ.145కే ఇంటర్నెట్ అందిస్తామని, ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సెన్సార్ల ద్వారా ప్రతీ ఎల్ఈడీ బల్బ్ ను పర్యవేక్షించవచ్చని అన్నారు.
డ్రోన్లు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ సెన్సార్ల ద్వారా రియల్ టైమ్ గవర్నెన్స్ అందించడానికి టెక్నాలజీని ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. ఇదే వేదికపై నుంచి 2017సంవత్సరాన్ని ప్రగతి భవన్ గా ప్రకటించినట్లు సీఎం తెలియజేశారు.