సాగర్ చుట్టూ 40 చోట్ల ఆకాశహర్మ్యాలు, నీటి తొలగింపు
హైదరాబాద్: రాజధానిలోని హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఈ పనుల పర్యవేక్షణకు ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
సాగర్కు పూర్వవైభవం తేవడంలోనూ, హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి టవర్ల నిర్మాణంలోనూ పర్యావరణానికి ఎలాంటి ముప్పు రాకుండా చూడాలన్నారు. ఈ పనులన్నింటినీ పర్యవేక్షించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో ప్రదీప్చంద్ర, ఎస్కే జోషి, రేమండ్పీటర్, నాగిరెడ్డిలతో కూడిన ప్రభుత్వ కార్యదర్శుల ఉపసంఘానికి బాధ్యతలను ఆయన అప్పగించారు.
సాగర్లోకి వచ్చే నీటిని తరలించేందుకు వీలుగా కాలువలను నిర్మించాలని సూచించారు. ఇందుకోసం రూ.100 కోట్లు విడుదల చేయనున్నారు. మొదటి దశలో సాగర్ చుట్టూ 100 ఎకరాల విస్తీర్ణంలో 40 ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ విషయాలపై శనివారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించారు.
సుమారు 5గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాగర్ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. సాగర్లోకి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు వల్ల జల కాలుష్యం జరుగుతోందన్నారు.
దీనిని నివారించడానికి నాలాల ద్వా రా వచ్చే నీరు అందులోకి మళ్లింపు కాలువలు నిర్మించాలని అధికారులకు చెప్పారు. అందుకోసం త్వరలోనే టెండర్లు పిలవాలని సూచించారు. ఇందుకు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. వినాయక విగ్రహాలు, అమ్మవారి విగ్రహాల నిమజ్జనం వల్ల సాగర్ కలుషితమవుతోందన్నారు.
అటు ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే సాగర్కు పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఇందుకోసం ఇందిరాపార్కులో వినాయక సాగర్ పేరుతో చెరువు నిర్మించి అక్కడే నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దీనిపై ఎన్నికైన ప్రజాప్రతినిధులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్నారు.
సాగర్ నీటిలోనే గణేశ్ నిమజ్జనం జరిపే సంప్రదాయం ఉన్నందున వినాయకసాగర్ను కూడా సాగర్ నీటితోనే నింపాలని సూచించారు. వినాయకసాగర్ను కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయాలన్నారు. ఈ ఎండాకాలంలోనే సాగర్ నీటినంతా ఖాళీ చేసి, అడుగుభాగంలో ఉన్న మలినాలను తొలగించాలని సూచించారు.
సంజీవయ్య పార్కు ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్ నిర్మించాలని నిర్ణయించారు. సాగర్ చుట్టూ బుద్ధభవన్, రాణిగంజ్ బస్ డిపో, లోయర్ ట్యాంక్బండ్, కుందన్బాగ్, పాటిగడ్డ, సెయిలింగ్ క్లబ్, యూత్ హాస్టల్, రాఘవ సదన్, నర్సింగ్కాలనీ, దిల్కుషా గెస్ట్ హౌస్, గ్రీన్ల్యాండ్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎలక్ర్టిసిటీ భవన్, టెక్ట్స్బుక్ ప్రింటింగ్ ప్రెస్, రిడ్జ్ హోటల్, బూర్గుల రామకృష్ణారావు బిల్డింగ్, ఎక్స్పోటెల్, స్నో వరల్డ్ తదితర 40 ప్రాంతాల్లో మొదటి దశలో టవర్లు నిర్మిస్తారు.
ఈ స్థలాలకు సంబంధించిన మ్యాపులను కేసీఆర్ పరిశీలించారు. ఇవన్నీ కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్నాయని, పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టాల పరిధి ఆవల ఉన్న ప్రాంతంలోనే ఈ టవర్లు నిర్మిస్తామన్నారు.
పర్యావరణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, మార్గదర్శకాలకు లోబడి టవర్లు నిర్మించనున్నామన్నారు. టవర్ల వల్ల వచ్చే మురికి నీరు కూడా హుస్సేన్సాగర్లోనికి రాకుండా నేరుగా నాలాలలోకి వెళ్లే విధంగా భూగర్భ డ్రైనేజీ ఉండాలని సూచించారు.
పెద్ద ఎత్తున టవర్లు నిర్మిస్తున్నందున అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా మొదటి నుంచే సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగాలని అధికారుల్ని ఆదేశించారు. టవర్ల నిర్మాణానికి చాలా సంస్థలు ముందుకు వచ్చే అవకాశమున్నందున.. విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.