ఇకపై ‘యాదాద్రి’గా యాదగిరిగుట్ట: కెసిఆర్పై చిన్నజీయర్స్వామి ప్రశంసలు
నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పేరు మార్పు చేయబడింది. ఇకపై యాదగిరిగుట్టను ‘యాదాద్రి'గా పిలవడం జరుగుతుంది. ఈ మేరకు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి నామకరణం చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలన్నీ ఆగమశాస్త్రం ప్రకారం ఉన్నయని చిన్న జీయర్స్వామి తెలిపారు.
యాదగిరిగుట్ట అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను గురువారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఏరియల్ సర్వే ద్వారా చిన్న జీయర్స్వామికి వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం గుట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించిన చిన్న జీయర్స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పందిస్తూ.. ఆలయ పవిత్రత, సంప్రదాయం, ప్రత్యేకతలు చెక్కు చెదరకుండా సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసిన ప్రణాళికలు అద్భుతంగా ఉన్నయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. రాయగిరి, యాదగిరిగుట్ట చెరువులను పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని చెప్పారు. యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న మరో 8గుట్టలను కలిపి ‘నవ గిరులు'గా తీర్చిదిద్దుతామని చెప్పారు. గుట్టపైన 30 నర్సింహుని రూపాలను ప్రతిష్టిస్తామని చెప్పారు. గుట్ట మీద 100 వాహనాలు, గుట్ట కింద 5వేల వాహనాలు పార్క్ చేసేలా నిర్మాణాలు చేపడతామని తెలిపారు. డిజైన్ కోసం అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించామని, గుట్టలో మండల దీక్షకు హాలు నిర్మిస్తామని కెసిఆర్ తెలిపారు.
అంతకుముందు ముఖ్యమంత్రితో పాటు చిన్న జీయర్స్వామి యాదగిరి నర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పూజారులు సిఎం కేసీఆర్, చిన్న జీయార్స్వామికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అభివృద్ధి ప్రణాళికపై చినజీయార్స్వామి, దేవాదాయ శాఖ అధికారులతో సుమాలోచనలు చేశారు.