మాజీ పీసీసీ చీఫ్ భూములు వెనక్కి, కేసీఆర్ నోట గద్దర్ మాట
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో.. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న స్థానికులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గద్దర్ పేరును ప్రస్తావించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. జంట నగరాల్లో లక్షమంది పేదలకు పట్టాలు ఇస్తామని చెప్పారు. పేదలకు ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందన్నారు. హైదరాబాదును గుడిసెలు లేని నగరంగా తీర్చిదుద్దుతామన్నారు. ఆలస్యమైనా అందరికీ పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు.
రూ.10వేల కోట్ల విలువైన భూములను పేదలకు ఇస్తామని చెప్పారు. పేదలందరికీ న్యాయం జరిగేదాకా విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తామన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు. మణికొండలో భూములు పేదలకు ఇస్తామన్నారు.
మాజీ పీసీసీ చీఫ్ మడికొండలో భూములు తీసుకున్నారని, వాటిని వెనక్కి తీసుకుంటామన్నారు. జంట నగరాల్లో రెండున్నర లక్షల మంది స్లమ్లో బతుకుతున్నారన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం కలలు నిజం చేస్తామన్నారు.
సమైక్య రాష్ట్రంలో చాలా నష్టపోయామని, చాలా దెబ్బతిన్నామన్నారు. ఇక అలా జరగదన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వచ్చేదో ఎవరికీ తెలియదన్నారు. కానీ ఇప్పుడు కరెంట్ పోవడం లేదన్నారు. తనకు మరో ఏడాది సమయం ఇస్తే కరెంట్ రెప్పకొట్టే సమయం కూడా పోనియ్యనని చెప్పారు.
అందరి సహకారంతో హైదరాబాదును ప్రపంచంలోనే నెంబర్ వన్గా చేస్తానని చెప్పారు. అమెరికాలో ఉన్నవాడు బంగారం తిని అలా ఎదగలేదని, మనం తింటున్న అన్నమే వారు తింటున్నారని, కాకుంటే వారు జాగృతమై ఎదిగారని, మనం కూడా ఇప్పుడు జాగృతమయ్యామని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ గద్దర్ పేరును ప్రస్తావించారు. గద్దర్ పేదల కోసం పోరాడాడన్నారు.