దన్నం పెడుతా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిచేయండి: సీఎం రమేశ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ను హడావుడిగా విభజించారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అన్నారు. ఏపీ పునర్ వ్వవస్థీకరణ చట్టం, హమీల అమలపై రాజ్యసభలో గురువారం సాయంత్రం చర్చ జరిగిన సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఏపీ విభజన జరిగిన తీరు సరిగా లేదని చెప్పారు.
ఏపీని విభజించడానికి తొందరపడొద్దని ఆరోజే చెప్పామని గుర్తు చేశారు. ఏపీ విభజన బిల్లులో తప్పులున్నాయని చెబితే అప్పుడు పట్టించుకోలేదని ఆయన ఆవేదన చెందారు. విభజన జరిగిన తీరు అందరం చూశామని చెప్పారు. లోక సభ తలుపు మూయించి వేసి బిల్లును పాస్ చేయించారని అన్నారు.
ఏపీ వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రత్యేకహోదాకు మద్దతు పలుకుతున్న ప్రతి పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఆరోజు వెంకయ్యనాయుడు అలా డిమాండ్ చేయడం వల్లే ఈ రోజు చర్చ జరుగుతోందని ఆయన చెప్పారు. ఇప్పుడంతా వెంకయ్యనాయుడు ఎక్కడ? ప్రత్యేకహోదా ఎక్కడ? అని అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు.
బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశామని, ప్రజలు తమ కూటమికి మద్దతు పలికారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ క్రమంలో తిరుపతిలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని, బ్రహ్మాడమైన రాజధాని నిర్మిస్తామని సాక్షాత్తూ ప్రధాని మోడీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన ఏడు మండలాలను కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వద్దకు వెళ్తే వెంకయ్య ఆ ఫైల్ని తీసుకుని రాష్ట్రపతి వద్దకు వెళ్లి, దానిని ఆమోదించేలా చేశారని పేర్కొన్నారు. ఏపీలో కేవలం 21 శాతం అర్భన్ పాపులేషన్ ఉందని, దీంతో ఏపీలో ఆదాయవనరులు లేకుండా పోయాయని ఆయన చెప్పారు.
ఏపీకి క్యాపిటల్ ఆదాయం లేదని ఆయన తెలిపారు. ఆదాయ వనరుల్లో వ్యత్యాసం వస్తోందని, న్యాయం చేయాలని తాము అడిగామని అన్నారు. తొలి సంవత్సరం 16,200 కోట్లు ఇస్తామన్నారు. తరువాత ప్లానింగ్ కమీషన్ నిర్ణయిస్తుందన్నారు. ఏపీకి ఆర్ధిక లోటు భర్తీ చేస్తామని చెప్పి అది కూడా చెయ్యలేదని అన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే బాగుంటుందని అంతా చెబుతున్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తేనే బిల్లుకు అంగీకరిస్తామని బీజేపీ కూడా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. బీజేపీపై నమ్మకం ఉందని, ఏపీకి ప్రత్యేకహోదా కావాలని అంతా కోరుకుంటున్నారని, ఏపీకి తప్పకుండా ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.