అంతా రహస్యమే: రాజయ్య బర్తరఫ్పై కెసిఆర్
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఉప ముఖ్యమంత్రి, వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్య బర్తరఫ్పై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ముందే నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ అంశంపై వరంగల్ ఎంపి కడియం శ్రీహరి, మంత్రి లక్ష్మారెడ్డికి కూడా ముందే సంకేతాలు ఇచ్చినట్లు విశ్వనీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో శనివారం నుంచి ఆదివారం వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
శనివారం సాయంత్రం సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ను సీ బ్లాక్లోని ఆయన చాంబర్లో కడియం శ్రీహరి, మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కలిశారు. రాజయ్య బర్తరఫ్, శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశంతోపాటు, శాఖల కేటాయింపుపైనా వారికి ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, ఆదివారం సాయంత్రం విద్యుత్ శాఖ మంత్రిగా తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం జడ్చర్ల పరిధిలో పెట్టుకున్న కార్యక్రమాలన్నింటినీ లక్ష్మారెడ్డి రద్దు చేసుకొని హైదరాబాద్కే పరిమితమైనట్లు తెలిసింది.
మరోవైపు, విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి జగదీశ్ రెడ్డికి కేసీఆర్ ఫోన్ చేసి శాఖ మారుస్తున్న విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. ‘విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించావ్. కీలకమైన విద్యుత్ శాఖను అప్పగిస్తున్నా' అని జగదీశ్ రెడ్డితో సీఎం కేసీఆర్ అన్నట్లు సమాచారం. అలాగే, మంత్రిగా కడియం ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని ఖరారు చేసి, ఆదివారం ఉదయమే రాజ్భవన్కు సీఎం కార్యాలయం కబురు పెట్టినట్లు సమాచారం.
అయితే, ఏ దశలోనూ ఈ వివరాలను సీఎం శిబిరం బయటికి పొక్కనివ్వలేదు. రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తే.. దళిత సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమై.. కడియం ప్రమాణ స్వీకారం చేసే సమయానికి రాజ్భవన్ ముందు నిరసనలకు దిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందడమే ఇందుకు కారణమని భావించినట్లు తెలిసింది.
కడియం ప్రమాణ స్వీకారానికి సంబంధించి మీడియాకూ అధికారిక సమాచారం ఇవ్వలేదు. కార్యక్రమం ముగిసిన తర్వాత.. ‘సీఎం కేసీఆర్ సూచన మేరకు రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించడానికి గవర్నర్ అంగీకరించారు' అనే సమాచారం రాజ్భవన్ నుంచి బయటికి వచ్చింది. ఆ తర్వాత వెంటవెంటనే కడియంకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం, శాఖల కేటాయింపుపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఈ విషయాలపై రాజయ్యకు సమాచారం లేనట్లుగా తెలుస్తోంది.
అందుకే ఆయన టిఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు డి దామోదరారావు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం హోదాలో వెళ్లారు. ఈ వివాహ వేడుకలకు సిఎంతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఆ తర్వాత మంత్రులతో కలిసి సిఎం కెసిఆర్ రాజ్భవన్కు వెళ్లారు. ఇంతలోనే మీడియాలో రాజయ్య బర్తరఫ్, కడియం శ్రీహరి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణ వార్తలు ప్రసారమయ్యాయి. అయితే అప్పటికి సమాచారం లేని రాజయ్య తాను ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదని పలువురు మీడియా ప్రతినిధులకు చెప్పడం గమనార్హం.