దాసరి ఆనందం: నా నిర్ణయంకాదు, కోల్ స్కాంలోకి మన్మోహన్ని లాగారు!
న్యూఢిల్లీ: బెయిల్ వచ్చినందుకు సంతోషంగా ఉందని దర్శకరత్న దాసరి నారాయణ రావు శుక్రవారం అన్నారు. బొగ్గు కుంభకోణం కేసు నుండి తాను నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. న్యాయమే గెలుస్తుందన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తాను నిర్మించబోయే సినిమా అక్టోబర్ నెలలో ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా, బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్రమంత్రి అయిన దాసరి నారాయణకి ముందస్తు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.
కేసు విచారణ పూర్తి అయినందున దాసరి సహా 14 మంది నిందితులకు శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బొగ్గు స్కాం కేసులో విచారణ ఎదుర్కుంటున్న దాసరి, నవీన్ జిందాల్, మధు కోడా ఈ ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు.
రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు దేశం విడిచి వెళ్లరాదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది.
జార్ఖండ్లోని అమరుకొండ ముర్గా దుంగల్ బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో దాసరితో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సహా ఐదు కంపెనీల పేర్లను కూడా సీబీఐ చార్జిషీట్లో నమోదు చేసింది. నిందితులను ఈ రోజు కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు నిందితులు శుక్రవారం కోర్టు హాజరయ్యారు. దాసరి తరపున న్యాయవాది సతీష్ కోర్టులో వాదనలు వినిపించారు. దాసరికి ఈ కుంభకోణానికి సంబంధం లేదన్నారు. నిబంధనల ప్రకారం మైనింగ్ అనుమతులు ఇచ్చేందుకు అప్పట్లో ఎమ్ఓఎస్గా ఉన్న దాసరికి అవకాశం లేదని, ఒకవేళ అనుమతులు ఇచ్చినా కేబినెట్ అమోదం మేరకే ఇచ్చి ఉంటారన్నారు.
కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఆయనపై కేసు నమోదు అయ్యిందని కోర్టుకు తెలిపారు. కాగా, న్యాయస్థానంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును కూడా దాసరి ఈ కేసులోకి లాగారు.
నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చామని, తుది నిర్ణయం నాటి ప్రధాని తీసుకున్నదేనని చెప్పారు. అప్పుడు ప్రధాని వద్దే కోల్ మినస్ట్రీ ఉందని చెప్పారు. మంత్రిగా తాను నోట్ ఫార్వార్డ్ చేశానని, నిర్ణయం పీఎంవో తీసుకుందని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయం కాదన్నారు.