ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం : 'ఇక అంతా తెలుగులోనే!'
అమరావతి : దశాబ్దాలుగా తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఏమి చేయడం లేదనే అపప్రద తెలుగు జనాల్లో బలంగా నాటుకుపోయింది. తాజాగా ఏపీలో ఈ తరహా పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్లుంది ఏపీ సర్కార్. తాజాగా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయమే ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ.
తెలుగు భాషాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఈ మేరకు తెలుగులోనే ఉత్తర్వులను జారీ చేయడం విశేషం. ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలో మండలి బుద్దప్రసాద్, పరకాల ప్రభాకర్, నాగులపల్లి శ్రీకాంత్, జీవీ రామకృష్ణారావు, విజయభాస్కర్ లు సభ్యులుగా ఉండనున్నారు.
ఇకనుంచి ఏపీలోని దుకాణాల పేర్లు కూడా తెలుగులోనే ఏర్పాటు చేయాలన్న నిబంధనను తాజా ఉత్తర్వుల ద్వారా ప్రకటించింది ప్రభుత్వం. శిలాఫలకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పేర్లు తెలుగులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.