'అన్యాయం జరుగుతుంటే ఏంచేశారు', 'భద్రాద్రిని రాముడ్ని రాకుండా చేశారు '
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సభపై టిడిపి, బిజెపి నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు.
విజయవాడ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సభపై టిడిపి, బిజెపి నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, బిజెపి నేత సోము వీర్రాజులు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
రాహుల్ గాంధీని నమ్ముకోవడం అంటే కుక్క తోక పట్టుకొని గోదావరిని ఈదడమేనని దేవినేని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఏపీకి అన్యాయం జరిగినప్పుడు ఏం చేశారని నిలదీశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో అంతిమ సంస్కరణలు పూర్తయ్యాయన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కుర్ర చేష్టలు అని అశోక్ గజపతి రాజు అన్నారు. విభజన శాస్త్రీయంగా జరగలేదని చెప్పారు. విభజన తీరుతో ఏపీకి అన్యాయం జరిగినప్పుడు వీరంతా ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రం ఇబ్బందిపడేలా బిల్లు రూపొందించారని ఆరోపించారు. పోలవరంపై రెండు తెలుగు రాష్ట్రాలు గొడవ పడేలా చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు ఫోబియా పట్టుకుందని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా సభకు చిరంజీవి గైర్హాజరు
ఏపీకి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏపీకి కాంగ్రెస్ హయాంలో ఏం చేశారు, బిజెపి హయాంలో ఏం చేశారో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పదేళ్ల పాటు మంత్రిగా ఉన్న రఘువీరా కనీసం జిల్లాకు ఏం చేయలేదని ఎద్దేవా చేశారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని, కనీసం భద్రాద్రి రాముడిని కూడా ఏపీకి దక్కకుండా చేశారన్నారు. ఏపీకి దమ్ముగూడెం గ్రావిటీ కింద రావాల్సిన 200 టీఎంసీల నీటిని రాకుండా చేశారన్నారు.