ఇది చంద్రబాబు నిజ స్వరూపం కాదు, స్వార్థ ప్రయోజనాలు ముగిశాక: ఏకేసిన కేవీపీ
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్యాకేజీపై ఉన్న మోజు ప్రత్యేకహోదాపై లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ద్వారా వచ్చే లాభాల కంటే కూడా ప్యాకేజీ ద్వారా వచ్చే లాభాలే ఆయనకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును కేంద్రం అడ్డుకుందని ఆయన అన్నారు. రాజ్యసభ నిబంధనలను ఎన్డీయే ప్రభుత్వం తుంగలో తొక్కి ఏపీకి ప్రత్యేకహోదా బిల్లుని లోక్సభ స్పీకర్ పరిధిలోకి నెట్టారుని ఆయన ఆరోపించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టును ఆపేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు.
ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ తాను రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంలో జరిగిన అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఒరిస్సా ఎంపీ అనుభవ్ మహంతి పోలవరంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అరుణ్ జైట్లీ నుంచి వేరే డైరెక్షన్లో వస్తే తప్ప మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
పోలవరం ప్రాజెక్టుని ఆపేయడం కోసం మనకు తెలియకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఊహించిన భయం నాలో మొదలైందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న కేంద్రం, దానిని పూర్తి చేసేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు.
పోలవరానికి చాలా చరిత్ర ఉందని చెప్పిన కేవీపీ, 1860లో సర్ ఆర్ధర్ కాటన్ దొరగారు మొట్టమొదట పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత ప్రదేశంలో ప్రతిపాదించారని అన్నారు. పోలవరంపై ఉమాభారతికి రాసిన లేఖలకు ఎటుంటి సమాధానం రాలేదని, ఆమెకు తాను రాసిన లేఖలు చేరినట్టు అక్నాలెడ్జెమెంట్ అందాయని ఆయన చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే పోలవరం ప్రాజెక్టును ఆపేయాలని కుట్రపన్నుతున్నాయా? అన్న అనుమానం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2005లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కాంట్రాక్టర్లను పిలిచి కాలవ పనులు అప్పగించారని అన్నారు.
ప్రాజక్టు కట్టకుండా కాల్వలు తవ్వడం ఏంటని అప్పుడు అందరూ నవ్వారని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసినా కాల్వలు తవ్వడానికి 25 ఏళ్లు పట్టిందని, పోలవరం ప్రాజెక్టు అలా జరగకూడదన్న ముందు చూపుతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పోలవరం కుడి, ఎడమ కాల్వల పనులు ప్రారంభించారని ఆయన తెలిపారు.
అలా అప్పుడు రాజశేఖరరెడ్డి తవ్వించిన కాల్వల కారణంగా ఇటీవల ముగిసిన కృష్ణా పుష్కరాల్లో నెత్తిమీద నాలుగు నీళ్లు చల్లుకోవడానికి ఉపయోగపడ్డాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు పూర్తి చేసి, కేంద్రానికి అప్పగిస్తే ఆ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయి ఉండేదని ఆయన అన్నారు.
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చంద్రబాబు నాయుడికి ప్యాకేజీపై ఉన్న మోజు ప్రత్యేకహోదాపై లేదనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఏపీకి హోదా కంటే కూడా ప్యాకేజీలపైనే ఆయన ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడో అంతుచిక్కడం లేదని ఆయన అన్నారు.
చంద్రబాబుకు ఓన్లీ ప్యాకేజీల మీద ఆసక్తి ఎందుకంటే, తనకు జరిగే లాభాలు ఎంతో ఆయనకే తెలుసు కాబట్టి, ఏపీకి హోదా కోసం పోరాడటం లేదని ఆయన అన్నారు. ఏపీకి హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చేసిన క్రమంలో చంద్రబాబుకు ఆగ్రహం వస్తుందని ఆనాడు నేను చెప్పానని ఆయన అన్నారు.
చంద్రబాబుకు వచ్చిన ఆగ్రహనికి కృష్ణాలో నీళ్లు ఎండిపోయాయి అనే వార్తలు వస్తాయని నేను ముందే చెప్పానని, అయితే కృష్ణాలో నీళ్లు ఎండిపోయాయో తెలియదు గానీ, పేపర్ వెయిట్లు పగిలాయని అన్నారు. పోనీ చంద్రబాబు చేతకానివాడు, తెలివిలేని వాడు, అధైర్యవంతుడు అనుకుందామంటే కాదని ఆయన చెప్పారు.
కేంద్రంతో మాట్లాడి సాదించుకోవడానికి చంద్రబాబు ఏమీ సమర్థత లేని నాయకుడు కాదా? అంటే ఖచ్చితంగా కాదు అనే సమాధానం చెప్తానని అన్నారు. బాబు గతంలో రాష్ట్రపతి, ప్రధానులను కేంద్రంలో నిలబెట్టిన వ్యక్తి అని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ఆయనే చాలా సార్లు చెప్పారని ఆయన గుర్తుచేశారు.
మరి రేపో మాపో ప్రధానిగా కూడా నిలబడతారని ఆయన అన్నారు. అలాంటిది ఇంత సమర్ధత కలిగిన చంద్రబాబు ఎందుకని కర్తవ్య నిర్వహణలో వెనుకడుగు వేస్తున్నారని ఆలోచిస్తే చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడడం లేదని స్పష్టంగా తేటతెల్లం అవుతుందని అన్నారు.
ఇప్పుడు చంద్రబాబు చూపుతున్నది ఆయన నిజస్వరూపం కాదని, స్వార్ధప్రయోజనాలన్నీ పూర్తయిన తరువాత...ప్యాకేజీ డబ్బులన్నీ స్వార్ధానికి వినియోగించుకున్న తరువాత ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు తిరుగుబావుటా ఎగురవేస్తాడని తనేంటో చూపిస్తారని అన్నారు.