హోదాపై బీజేపీకి శివాజీ ట్విస్ట్: చిరు, కాంగ్రెస్ రెడీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు బీజేపీ నేత, ప్రముఖ సినీ నటుడు శివాజీ కూడా పోరుకు సిద్ధమని చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ యూ టర్న్ తీసుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, ఏపీసీసీ చీఫ్ రఘువీరగా రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై కార్యాచరణకు యోచిస్తోందని తెలుస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా పైన బీజేపీ నేత, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీకి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని, ఇందుకు నిర్ణీత కాల వ్యవధి లేదని చెప్పారు. తాము చేయాల్సిందంతా చేస్తున్నామన్నారు.
ఏపీకి రెవెన్యూ లోటు ఉన్నందున మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్రం నిధులు వాటా వస్తోందని, ఇతరత్రా నిధులు మంజూరు అవుతున్నాయని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటిని తాము నెరవేరుస్తామన్నారు. ప్రత్యేక హోదా ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నామన్నారు. రాజధానికి పునాదులు వేసి పనులు జరిగేకొద్ది నిధులు పెంచుతామన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తా: శివాజీ
మరోవైపు, ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తానని శివాజీ చెబుతున్నారు. ఇందుకోసం తాను గుంటూరులో ఆమరణ దీక్ష చేస్తానని చెప్పారు. తనకు బీజేపీ సభ్యత్వం ఉందని, తన ఐడీ నెంబర్ 1098825279 అని చెప్పారు. అయతే బీజేపీలో ఉన్నానా లేదా అనే విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టం చేయాలన్నారు.
తాను పార్టీకి, నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెండ్ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుందన్నారు. బీజేపీ నేత సోము వీర్రాజు తనను విమర్శించడం వల్లే తాను విమర్శించాల్సి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రజల హక్కులపై మాట్లాడితే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఎలా అవుతుందన్నారు. తనను వివాదాల్లోకి లాగవద్దని ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకాలని చేతులు జోడించారు.