అమరావతి: వివాదంగా ఆహ్వాన పత్రిక, నేటి నుంచి డ్రోన్ సర్వే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాజధాని అమరావతి పండుగ జరుపుకోవడానికి సమయాత్తమైన వేళ అమరావతి ఆహ్వాన పత్రికపై వివాదం రేగింది. తెలుగు రాష్ట్రంలో తెలుగు రాజధాని అని గొప్పగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి ఆహ్వాన పత్రం ఆంగ్లంలో ముద్రించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగు భాషోద్యమ సమాఖ్య నేత సామల రమేష్ బాబు తెలిపారు.
విజయవాడలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, అమరావతి ఆహ్వాన పత్రికను తెలుగులో ముద్రించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు రాజధాని నిర్మాణానికి కూడా ఆంగ్ల ఆహ్వాన పత్రిక ఏంటని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఆహ్వాన పత్రికను తెలుగులో ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో మంగళవారం నుంచి అధికారులు డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. ఈ డ్రోన్ సర్వే ద్వారా ప్రస్తుతం ఉన్న పరిస్థితితో భవిష్యత్తులో రాజధాని ప్రాంతంలో జరిగిన అభివృద్ధితో సరిపోల్చే వీలుంటుంది. డ్రోన్ సర్వేలో కెమెరాతో ప్రతి అంశాన్ని నిక్షిప్తం చేయనున్నారు.
అంతేకాదు రిమోట్ కంట్రోల్తో నియంత్రించవచ్చు. భూమి స్థితిగతులు, నీటి ప్రవాహ దిశలు లాంటి ప్రతి విషయాన్ని చిత్రీకరణ చేయవచ్చు. అనంతరం ప్రతి 1.5 మీటరుకు భూమి స్థితిగతులపై నివేదిక తయారుచేస్తారు. అమరావతి నిర్మాణంలో తుది ప్రణాళిక తయారీలో భాగంగా డ్రోన్లతో సర్వే చేయనున్నారు. ఈ సర్వే మూడు వారాలు పాటు కొనసాగే అవకాశం ఉంది.