సంచలనం: 'నంద్యాల ఎన్నికల్లో బాబు కచ్చితంగా ఓట్లు కొంటారు'
కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.దీనిపై సిపిఐ రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఓటుకు నోటు ఇవ్వగలననని చెప్పినందుకు ముఖ్యమంత్రిపై దుమ్మెత్తిపోశారు.
అమరావతి: కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై సిపిఐ రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఓటుకు నోటు ఇవ్వగలననని చెప్పినందుకు ముఖ్యమంత్రిపై దుమ్మెత్తిపోశారు.
ఓటుకు రూ.5వేలు ఇవ్వగలను, ఎవరు డబ్బిచ్చినా..: చంద్రబాబు సంచలనం
ప్రతి ఎన్నికల్లోను చంద్రబాబు ఓటును కొనుగోలు చేస్తారని రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు కేవలం పబ్లిక్ ఓట్లే కాదని, చివరకు టిడిపి ఓట్లు కూడా కొనుగోలు చేస్తారని ధ్వజమెత్తారు. పార్టీ కౌన్సెలర్లు, జిల్లా పరిషత్ మెంబర్లు, ఎమ్మెల్సీల ఓట్లు కూడా కొంటారన్నారు.
నంద్యాలలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు
ప్రతి నియోజకవర్గానికి రూ.10 నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసే ఉద్దేశ్యం చంద్రబాబుకు ఉందని రామకృష్ణ సంచలన ఆరోపణ చేశారు. రానున్న నంద్యాల ఉప ఎన్నికల్లోను చంద్రబాబు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. ఒక్కో ఓటుకు రూ.5000 ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు.
ఆర్కే నగర్.. నంద్యాల ఉప ఎన్నికలకు..
చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రామకృష్ణ చెప్పారు. ప్రభుత్వం అంటే ప్రజలకు ధర్మకర్త వంటిది అన్నారు. కానీ చంద్రబాబు మాటలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. తమిళనాడులోను ఆర్కే నగర్ ఎన్నికలను ఇటీవల లంచం నేపథ్యంలో ఈసీ రద్దు చేసిందని గుర్తు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
చంద్రబాబు సంచలనం..
కాగా, కర్నూలు జిల్లాలో ఇఫ్తార్ విందులో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మాకంటే తర్వాత తరం నాయకులు మరింత పాజిటివ్గా ఉన్నారని, ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకు వచ్చామని చంద్రబాబు అన్నారు. తనకు నాయకుడు కావాలని, ఎన్నికల్లో గెలవాలని వ్యాఖ్యానించారు. గెలవడానినికి నాయకులు కావాలి కాబట్టి రాజీపడ్డామన్నారు. తాము రాజీపడటం వల్ల కొంతమందికి నష్టం జరిగిందన్నారు.
మాకే ఓటేయాలి
అంతేకాదు, చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ.. తనకు నాయకుడు కావాలని, ఎన్నికల్లో గెలవాలన్నారు. తన వల్ల లాభం పొందిన వాళ్లంతా టిడిపికి ఓటేయాలన్నారు. తాను పెన్షన్ ఇస్తున్నానని, రుణమాఫీ చేస్తున్నానని, ఎన్నికల్లో ఎవరు డబ్బిచ్చినా తనకే ఓటు వేయాలన్నారు. తాను తలుచుకుంటే ఓటుకు రూ.5వేలు ఇవ్వగలనని, కానీ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
ఓ నమస్కారం పెడతా
నంద్యాల ఉప ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని చంద్రబాబు కోరారు. తనకు వ్యతిరేకంగా ఏవైనా గ్రామాలు ఉంటే తాను నమస్కారం పెడతానని చెప్పారు. మేం ఇచ్చిన పించన్ తీసుకుంటూ, నేను వేసిన రోడ్డుపై నడిచి ఓటు వేయనంటే ఎలా అని ప్రశ్నించారు. రాయలసీమలో ఇప్పటికీ పెత్తందారీ వ్యవస్థనే నడుస్తోందని, రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకే నాయకులను తెచ్చానని చెప్పారు.