ఏడు జన్మలెత్తినా చేయలేరు: కెసిఆర్, బాబులపై నారాయణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రజలను మభ్యపెట్టి చేసే వాగ్థానాలు అమలు పరచలేరని సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు కె. నారాయణ అన్నారు. తిరుమల తిరుపతి ఏడు కొండల కంటే గొప్పగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ అంటుంటే, హైదరాబాద్ నగరం కంటే గొప్పగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తానని చంద్రబాబు చెపుతున్నారని, ఈ విషయంలో ఇద్దరు సీఎంలు ఏడు జన్మలెత్తినా వాటిని అమలు చేయలేరన్నారు. ఇద్దరు నేతలూ రెండు రాషా్ట్రల ప్రజలను భ్రమల్లో పెట్టి వారు ఎదుర్కొనే సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని నారాయణ విమర్శించారు.
గురువారం మక్ధూమ్ భవన్లో పార్టీ నేత సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేసీఆర్ కరీంనగర్ను అమెరికా మాదిరిగా చేస్తానంటే, చంద్రబాబు నూతనంగా నిర్మించే రాజధానిని సింగపూర్ మాదిరిగా తయారు చేస్తారని ప్రకటిస్తున్నారని, ఇరువురు ముఖ్యమంత్రులు చేసిన వాగ్థానాలు నెరవేరితే చెవి కోసుకుంటానని నారాయణ సవాల్ చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి లేరని నారాయణ ఆరోపించారు.
రాష్ట్రానికి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని గద్దెనెక్కిన వెంకయ్యనాయుడు ఆ మాటలకు కట్టుబడి ఉండాలన్నారు. హుధుద్ తుపాను వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పర్యటించిన ప్రధాని మోడీ, ఉదారంగా నిధులు విడుదల చేస్తారని హామీ ఇచ్చి ఇప్పటి వరకూ చిల్లి గవ్వకూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అనుకున్నంత స్థాయిలో ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవలంబించే విధానాల వల్ల కరవు, ఆత్మహత్యలు పెనవేసుకుపోయాయని నారాయణ చెప్పారు.
ఇద్దరు ముఖ్యమంత్రులకు మోడీని కాకా పట్టడానికే టైమ్ సరిపోతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రామోజీరావుని కాకా పట్టి మోడీకి దగ్గరవ్వాలని చూస్తున్నారని చెప్పారు. ఇద్దరు సీఎంలు, ఒకరినొకరు తిట్టుకుంటూ తమ తమ ప్రాంతంలో బలపడే తాపత్రయంలో ఉ న్నారన్నారు. ఇద్దరూ వ్యక్తిగత అహంభావాన్ని పక్కనబెట్టి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అభివృద్దికి పాటుపడాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్డీఐ)లపై అనుకూల నిర్ణయాలు తీసుకోవడాన్ని నారాయణ తప్పు పట్టారు.
అమెరికా అధ్యక్షుడు ఒబామాను సంతృప్తి పరిచేందుకు, ఆయనకు రెడ్ కార్పెట్ పరిచేందుకు మోడీ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని అన్నారు. బీజేపీ ఆలోచిస్తున్న మతమార్పిడి బిల్లు ప్రమాదకమైందని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ చట్టం తీసుకొస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని హెచ్చరించారు. మార్చి 25 నుంచి 27 వరకూ పాండిచ్చేరిలో జరిగే సీపీఐ మహాసభల్లో దీనిపై చర్చిస్తామని చెప్పారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వీలుగా కొల్లేరును అలాగే ఉంచాలన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కొల్లేరు ఎవరూ ముట్టుకోకూడదన్నారు.
సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను మౌనంగా ఉంటారని బీజేపీ నాయకులు విమర్శిస్తారని, మరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇతర కీలక విషయాలపై మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. చేపల పెంపకం పేరుతో కొల్లేరు ప్రాంతంలో కొంత మంది దళారులు ‘ఫిష్ మాఫియా'గా మారి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చిన యువతే ఆయన్ని గద్దె దింపుతుందని నారాయణ హెచ్చరించారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థను నిర్మూలిస్తామన్న చంద్రబాబు ఇపుడు ఆ విషయమే పట్టించుకోక పోవడం దారుణమన్నారు.
ఎన్నికల సమయంలో టీడీపి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం ఇందిరాపార్కు దగ్గర చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడారు.కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ, ఔట్సోర్సింగ్ వలన దళారులు లబ్ధి పొందుతున్నారని నారాయణ చెప్పారు.