లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని, తృతీయ శక్తిగా పవన్ కళ్యాణ్: నారాయణ
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు చాలా సీరియస్ వ్యవహారమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఆయన అనంతరం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే ఈ కేసు విచారణలో జాప్యం జరిగినందు వల్ల వీలైనంత త్వరగా పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చేయాలని అన్నారు. ఏ కారణం వల్ల ఆలస్యం జరిగినా ఇకపై విచారణ ప్రక్రియ వేగంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఓటుకు నోటు కేసులో టెలిఫోన్ సంభాషణల్లోని స్వరం ఎవరిదో అందరికీ తెలుసునని అన్నారు.
సామాన్య ప్రజలు కూడా ఆ గొంతును గుర్తు పట్టుగలుగుతారని, ఫోరెన్సిక్ నివేదిక కూడా సిద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కూడా ఆయన మండిపడ్డారు. హోదా కోసం పోరాడాలని పవన్ భావిస్తే, పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని సలహా ఇచ్చారు.
పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేకుంటే రజనీకాంత్ లా ఇంట్లోనే కూర్చోవాలని, పండక్కో పబ్బానికో బయటకు వచ్చి నాలుగు మాటలు చెబితే సరిపోదని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ తన అభిప్రాయాన్ని చెప్పడంలో తడబడుతున్నాడని అన్నారు.
రాష్ట్రంలో అధికార, విపక్షాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తృతీయ ప్రత్యామ్నాయ శక్తి అవసరం ఎంతో ఉందని, ఆ స్థానానికి పవన్ సరిపోతారని నారాయణ అభిప్రాయపడ్డారు.
అవసరమైతే పవన్తో చర్చిస్తామని ఆయన అన్నారు. సరైన ప్రణాళికలో ముందుకు సాగితే తృతీయ శక్తిగా పవన్ కళ్యాణ్ ఎదిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని అని, జగన్ను సైతం పార్టీలో చేర్చుకుంటాననడం అతని అవివేకానికి నిదర్శనమని ఆయన అన్నారు.