హోదాపై కేవీపీకి కౌంటర్గా రంగంలోకి టిడిపి.., బీజేపీకి డెడ్లైన్!
విజయవాడ/న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశం రాజుకుంటోంది. ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రయివేటు మెంబర్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. దీనిపై చర్చ, ఓటింగ్ జరగాలని కాంగ్రెస్ సభ్యులు ఇప్పటికే పట్టుబడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ లోకసభలో ప్రత్యేక హోదా పైన నోటీసు ఇచ్చారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరుతూ ఎంపీ రామ్మోహన్ నాయుడు సోమవారం నోటీసు ఇచ్చారు. విభజన సమయంలో అన్ని విధాలా నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చంపేసి, సంతాప సభ: సీఎం రమేష్
విభజన ద్వారా ఏపీని కాంగ్రెస్ పార్టీ చంపేసిందని, ఇప్పుడు సంతాప సభ పెట్టాలనుకుంటోందని టిడిపి ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ వాస్తవాన్ని గ్రహించినట్లుగా కనిపిస్తోందని, అందుకే వారు ప్రయివేటు మెంబర్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని చెప్పారు.
బీజేపీది క్రిమినల్ ఆలోచటన అని నారాయణ
ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీవి క్రిమినల్ ఆలోచనలు అని సిపిఐ నేత నారాయణ విజయవాడలో మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుది ద్వంద్వ వైఖరి అని ధ్వజమెత్తారు. వచ్చే నెలలో ధరల పెరుగుదల పైన నిరసన తెలుపుతామని చెప్పారు.
రామకృష్ణ అల్టిమేటం
కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన హోదా ప్రయివేటు మెంబర్ బిల్లు పైన ఆగస్టు 5వ తేదీన చర్చ జరుపుతామని డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పారు. దీనిపై సిపిఐ నేత రామకృష్ణ స్పందించారు.
ప్రత్యేక హోదా
ఆగస్టు 5వ తేదీన హోదా బిల్లును ఆమోదించకుంటే ఏపీ బందుకు పిలుపునిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలన్నారు. హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో బీజేపీయేతర పక్షాలు సమావేశం అవుతాయని చెప్పారు.