బిజెపిలోనూ కాపు రిజర్వే,న్ల చిచ్చు: రెండుగా చీలిన నేతలు
విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ ఆంధ్రప్రదేశ్ బిజెపిలోనూ చిచ్చు పెట్టింది. బిజెపి నేతలు రెండుగా చీలిపోయారు. సీనియర్ నేతలు కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్కు మద్దతు ఇస్తున్నారు. బీసీ నేతలు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం దీక్షకు సోము వీర్రాజు మద్దతు ప్రకటించారు. కన్నా లక్ష్మినారాయణ ఏకంగా కాపు ఐక్య గర్జన సమావేశానికి హాజరయ్యారు కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రభుత్వ ఆలోచనను బిజెపి అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ, పార్టీ ఉపాధ్యక్షుడు పి కపిలేశ్వరయ్య వ్యతిరేకిస్తున్నారు.
ప్రభుత్వ ఆలోచనను వారు బహిరంగంగానే తప్పు పట్టారు. కాపులను బీసీల్లో చేరిస్తే బీసీ రిజర్వేషన్ల ప్రయోజనం దెబ్బ తింటుందని వారు వాదిస్తున్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని కూడా అంటున్నారు.
తుని హింసకు సత్యనారాయణ ముద్రగడ పద్మనాభాన్ని, రాష్ట్ర నిఘా విభాగాన్ని తప్పు పట్టారు. కాపులు ప్రత్యేకంగా వెనకబడిన తరగతులకు చెందినవారు కారని అంటూ ఆర్థికంగానే కాకుండా సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనకబడివారి కోసం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 మంది శాసనసభ్యులుంటే అందులో 26 మంది కాపులున్నారని, అందువల్ల కాపులు రాజకీయంగా వెనకబడి ఉన్నారని చెప్పడానికి వీల్లేదని ఆయన అన్నారు. బీసీ శాసనసభ్యులు ఎంత మంది ఉన్నారు, వారిలో ఎంత మందికి మంత్రి పదవులు దక్కాయని ఆయన అడిగారు.