కలకలం: శ్రీవారి ఆలయం ముందు శిలువ గుర్తు
తిరుపతి: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇటీవలి కాలంలో పలుమార్లు అన్యమత ప్రచారం జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, తాజాగా మరోసారి అలాంటి ఘటనే తిరుమలలో చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయం ముందే శిలువ గుర్తు కనిపించడంతో కలకలం రేపింది.
శ్రీవారి ఆలయం ప్రాంగణంలో ఉన్న ఓ సిమెంటు దిమ్మెపై ఉన్న గుర్తు తిరుమల భక్తులను ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనపై పలువురు భక్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఈ ఘటనపై మరో వాదన వినిపించారు.
అది శిలువ గుర్తు కాదని ప్లస్ గుర్తని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. అంతకుముందు శ్రీవారి ఆలయం ముందున్న నాదనీరాజనం మండపం సమీపంలో ఓ సిమెంటు దిమ్మెపై శిలువ గుర్తు ఉన్న విషయాన్ని భక్తులు, స్థానికులు గుర్తించారు.
ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. ఇది ఇతర మతస్తుల పనేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి కొండపై అన్యమత ప్రచారం జరగడం పట్ల భక్తులు అధికారులపై మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు.