ఆడాళ్లు ప్రేమించాల్సిందే, మగాళ్లు రీచార్జీ...: లేదంటే ఏం చేస్తాడో తెలుసా..
ఓ యువకుడు కేవలం ఫోన్ రీచార్జీ కోసం నేరాలకు పాల్పడ్డాడు. తన ఫోన్ రీచార్జీ చేయించకపోతే పగబట్టినట్లు వ్యవహరించి వారి ఫోన్లు బ్లాక్ చేయించేవాడు.
గుంటూరు: ఓ సైబర్ నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నారు. ఫోన్ చేసినప్పుడు మగవాళ్లయితే తన ఫోన్ను రీచార్జీ చేయించాలి. ఆడవాళ్లయితే ప్రేమించాలి. లేదంటే సిమ్ కార్డు బ్లాక్ చేస్తాడు. దాంతో ఆగకుండా బాధితుల సిమ్ కార్డులే కాకుండా కుటుంబ సభ్యుల సిమ్లు, కంపెనీ ఉద్యోగుల సిమ్లు బ్లాక్ చేయిస్తాడు. అతని చేతిలో బాధపడినవారు దాదాపు 500 మంది ఉన్నారు.
గుంటూరులో ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతనికి సంబంధించిన వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ త్రిపాఠీ గురువారం వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన చేసి వివిధ రకాలుగా బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్న విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడ గ్రామానికి చెందిన దూళ్ళ పవన్కుమార్ అనే సైబర్ నేరగాడిని నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు.
త్రిపాఠీ చెప్పిన వివరాల ప్రకారం - పవన్కుమార్ తల్లిదండ్రులు కూలీపనులు చేసుకుంటూ అతడిని ఇంటర్ వరకు చదివించారు. వారికి అతడొక్కడే కుమారుడు. గజపతినగరంలో జూనియర్ ఇంటర్ చదివి మానేశాడు. ఆ తరువాత అక్కడే మూడునెలలు కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నాడు. కొంతకాలం విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మిమ్స్ ఆసుపత్రి క్యాంటీన్లో పని చేశాడు.
నిరుడు మార్చిలో మహారాష్ట్రకు వెళ్ళి పత్తి కంపెనీలో చేరి ఆగస్టు వరకు పని చేశాడు. అక్కడే ఆండ్రాయిడ్ ఫోన్ కొనుగోలు చేశాడు. ఏడాదిగా నేరాలకు పాల్పడుతూ వచ్చాడు. లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. సిమ్ రీచార్జ్ చేయాలంటూ బెదిరించేవాడు. లేకుంటే మాత్రం పగపట్టిన వాడిలా ప్రవర్తించేవాడు. మగవాళ్ళు ఫోన్ ఎత్తితే తాను ఎయిర్టెల్ ఉద్యోగిననీ, సిమ్కార్డు కాలపరిమితి అయిపోయిందనీ, తన నంబర్కు రీచార్జ్ చేస్తే తిరిగి యాక్టివేట్ అవుతుందని నమ్మబలికి రీచార్జ్ చేయించుకునే వాడు.
రీచార్జ్ చేయకుంటే బాధితునికి సంబంధించిన నంబర్లన్నింటినీ కస్టమర్ కేర్కు ఫోన్ చేయించి బ్లాక్ చేయించేవాడు. ట్రూకాలర్, ఫేస్బుక్ల ద్వారా వారి వివరాలను తెలుసుకుని కస్టమర్ కేర్కు ఫోన్ చేసి వివరాలన్నీ సరిగా చెప్పడంతో వారు నంబర్ బ్లాక్ చేసేవారు. పవన్ తిరిగి వారికి సంబంధించిన వేరే నంబర్లకు కానీ, కుటుంబ సభ్యులకు గానీ ఫోన్ చేసి నంబర్ బ్లాక్ అయ్యింది. ఇప్పుడైనా రిచార్జీ చేయించాలని, లేదంటే మిగతా నెంబర్లు బ్లాక్ అవుతాయని బెదిరించేవాడు.
అమ్మాయిలు ఫోన్ ఎత్తితే వారితో పరిచయం పెంచుకునేలా మాట్లాడతాడు. వారి వద్ద నుంచి స్పందన లేకుంటే దూషించడం, అసభ్యంగా మాట్లాడడమేకాక వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, వాట్సాప్, ఇతర వెబ్సైట్లలో పెడతానంటూ బెదిరించేవాడు. ఈ విధంగా పవన్కుమార్ బాధితులు 500 మందికి పైగానే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
యాపిల్ గ్రూప్పై ఇలా..
విశాఖలోని యాపిల్ హోటల్ మేనేజర్ కిషోర్కు, అందులో పని చేసే యువతికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. వారి నుంచి స్పందన లేకపోవడంతో యాపిల్ గ్రూప్నకు చెందిన ఉద్యోగులందరి సిమ్ కార్డులన్నింటినీ బ్లాక్ చేయించాడు. ఇదే విధంగా గుంటూరుకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నాగరాజుకు ఫోన్ చేసి తన సెల్ఫోన్కు రీచార్జ్ చేయించాలని బెదిరించాడు. వినకపోవడంతో సిమ్ను బ్లాక్ చేయించాడు.
నాగరాజు ఫిర్యాదుతో ఈ నెల 2న నగరంపాలెం పోలీస్స్టేషన్లో సైబర్ క్రైమ్ కేసును నమోదు చేశారు. ఈ కేసులో పవన్కుమార్ను గురువారం క్యూఆర్టీ పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న విశాఖ యాపిల్ హోటల్స్ మేనేజర్ కిషోర్, బాధితురాలు నేరుగా గుంటూరుకు వచ్చి నిందితుడిని అరెస్టు చేసినందుకు గాను అర్బన్ ఎస్పీ త్రిపాఠీని కలిసి అభినందించారు.