సేవ చేశా, బాబు పిలిస్తే టీడీపీలో చేరుతా: దాడి, కేసీఆర్ది తప్పే: టీడీపీకి రఘువీరా అండ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనను ఆహ్వానిస్తే తాను మళ్లీ సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నానని దాడి వీరభద్ర రావు శుక్రవారం అన్నారు. తాను టీడీపీకి 30 ఏళ్లపాటు సేవలు చేశానని చెప్పారు.
కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని వీడటం తనకు బాధను కలిగిస్తోందన్నారు. దాడి ఉదయం అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు దాడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలం క్రితం ఆ పార్టీని వీడారు. వైసీపీ అధ్యక్షులు జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజులుగా ఏ పార్టీలో లేకుండా దూరంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఆహ్వానిస్తే వెళ్తానని చెప్పడం గమనార్హం.
పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తా: చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్నారు. పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పుట్టపర్తిని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించామని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానని చెప్పారు.
ఆగస్టు 15 నాటికి పట్టిసీమ నుంచి సాగునీరు: దేవినేని
ఆగస్టు 15వ తేదీ నాటికి పట్టిసీమ నుంచి సాగునీరు అందిస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి సమీక్షిస్తారని చెప్పారు. అక్టోబర్ 22 నాటికి పోలవరం స్పిల్ వే, రాక్ ఫిల్ డ్యాం పనులు పూర్తి చేస్తామన్నారు. నాలుగు పోలవరం ముంపు గ్రామాలకు నష్టపరిహారం చెల్లించామన్నారు.
ప్రత్యేక హోదాపై రఘువీరా నిలదీత
ప్రత్యేక హోదా పైన బీజేపీ, టీడీపీలు ముందుకు పోవడం లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలన్నారు. పునర్విభజన చట్టంలోని అన్ని సెక్షన్లను అమలు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడటం నేరమేనని రఘువీరా వ్యాఖ్యానించడం గమనార్హం.
తప్పించుకునేందుకే సెక్షన్ 8: జగన్
ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తెచ్చారని వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో అన్నారు. రైతుల ఆత్మహత్యకు టీడీపీ సర్కారే కారణమని చెప్పారు.
అడ్డంగా బుక్ అయినప్పటికీ చంద్రబాబును అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. సెక్షన్ 8 గురించి చంద్రబాబు మొదటే ఎందుకు మాట్లాడలేదన్నారు. పునర్విభజన చట్టంలోని వాటిని అమలు చేయాలని ప్రధాని మోడీని, కేంద్రమంత్రులను కలిశామని చెప్పారు.