'పోలవరానికి ఇచ్చింది 100 కోట్లు కాదు 800 కోట్లు'
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 100 కోట్లే ఇచ్చిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి ఖండించారు. బుధవారం కడపలో నిర్వహించిన 'జన కల్యాణ్ పర్వ' కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలవరానికి కేంద్రం ఇచ్చింది రూ. 100 కోట్లు కాదని రూ. 800 కోట్లు మంజూరు చేసిందని ఆమె చెప్పారు. అలాగే ఏపీ రాజధానికి కేంద్రం రూ. 8 వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు.
ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో తమ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మంగళవారంతో సంవత్సరం పూర్తి అయింది. ఈ సందర్భంగా బీజేపీ దేశ వ్యాప్తంగా మోడీ తీసుకొచ్చిన సంస్కరణలు, పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు 'జన కల్యాణ్ పర్వ' కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే.