అమరావతి 'స్పెషల్' స్మార్ట్ సిటీ: హోదాపై వెంకయ్య కౌంటర్, హిందూపురంలో బాలకృష్ణ
హైదరాబాద్/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో మంచి జరుగుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని, కానీ ప్రత్యేక హోదాతోనే సమస్యలు అన్నీ పరిష్కారం కావని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నల్లపాడులో నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అధికారం కోల్పోయాక ప్రత్యేక హోదా గుర్తుకు వచ్చిందా అంటూ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ తాము తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. అమరావతిని ప్రత్యేక కేటగిరీ కింద స్మార్ట్ సిటీగా మారుస్తామని చెప్పారు.
అమృత్ పట్టణాల కింద కావలి, శ్రీకాళహస్తిలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రత్యేక హోదాతో మంచి జరుగుతుందనడంలో సందేహం లేదని, కానీ దాంతోనే అన్నీ పరిష్కారం కావన్నారు. ప్రత్యేక హోదా పైన అధ్యయానికి ప్రధాని మోడీ నీతి అయోగ్కు ఆదేశాలు జారీ చేశారన్నారు.
నీతి అయోగ్ ప్రత్యేక హోదా పైన అధ్యయనం చేస్తోందన్నారు. ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా పైన ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చక పోవడం వల్లే సమస్య వచ్చిందన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. నల్గొండ, హైదరాబాదులలో విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసక్తున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాలు స్వచ్ఛ భారత్ను మెరుగ్గా నిర్వహిస్తున్నాయన్నారు.
వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా 16 విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. అందులో నల్గొండ, హైదరాబాద్ ఉన్నాయన్నారు. అమృత్ పట్టణాల కింద తెలంగాణలో సిద్దిపేటను ఎంపిక చేశామన్నారు.
ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి బాలకృష్ణ భూమిపూజ
అనంతపురం జిల్లా హిందూపురం పారిశ్రామికవాడలో కొత్తగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ ఏర్పాటు స్థలం వద్ద స్థానిక ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ శుక్రవారం భూమిపూజ చేశారు.
కాగా, గురువారం బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో జరిగిన ఓ తెలుగు సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు చాలా గౌరవమని, మా నాన్నగారు ఎన్టీఆర్ పేరు వింటే నా రక్తం పొంగుతుందని, తెలుగంటే తనువు పులకిస్తుందని వ్యాఖ్యానించారు.