జగన్ అలర్ట్: చంద్రబాబు వ్యూహాన్ని తిప్పికొట్టారా?
హైదరాబాద్: ఇటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర రావు, ప్రకాష్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిరాయింపుల దుమారం చెలరేగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు మీడియా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
ఆ వార్తలు పెద్ద యెత్తున వస్తున్న సమయంలో జగన్ ప్రకాశం జిల్లా సంతమగులూరులో ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వర రావు తమ పార్టీలోకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వస్తున్నట్లు చెప్పిన వెంటనే ఎవరెవరు చేరుతున్నారనే విషయంపై పుకార్లు ప్రారంభమయ్యాయి. దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఒక్కరొక్కరే ఖండనలు ఇస్తూ వచ్చారు.
జలీల్ ఖాన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత తానేమీ టిడిపిలో చేరడానికి కలవలేదని స్పష్టం చేశారు. చంద్రబాబుతో బేరసారాలు కుదరకనే, తనకు మంత్రి ఇవ్వడానకి చంద్రబాబు నిరాకరించడం వల్లనే జలీల్ ఖాన్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ఇందులో ఏ పాటి నిజం ఉందో తెలియదు.
అయితే, వెంటనే ప్రకాశం జిల్లాకు చెందిన ఆరుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు జగన్ను కలిసి తమ విధేయతను ప్రకటించారు. ఇతర జిల్లాల శాసనసభ్యులు విడివిడిగా తాము పార్టీ మారడం లేదని చెప్పారు. అయితే, తెలంగాణలో తమ పార్టీ గల్లంతవుతున్న విషయం నుంచి దృష్టి మళ్లించడానికే టిడిపి నేతలు ఎపిలో ఫిరాయింపుల దుమారాన్ని రేపారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు విమర్శించారు.
మరోసారి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఫిరాయింపుల పుకార్లను ఖండించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడేది లేదని కలమట, కళావతి, కంబాల స్పష్టం చేసారు. బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి కూడా ఫిరాయింపుల వార్తలను ఖండించడమే కాకుండా చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీని దొంగ దెబ్బ తీయడానికే తమపై దుష్ప్రచారం సాగిస్తున్నారని వారు దుయ్యబట్టారు.
అయితే, తెలుగుదేశం పార్టీలో ఈ రెండు రోజుల వ్యవధిలో చేరిన శాసనసభ్యులు మాత్రం ఎవరూ లేరు. మొత్తం మీద, చాలా మంది శాసనసభ్యులు గురువారం ఫిరాయింపు వార్తలను ఖండించినవారు కూడా శుక్రవారం మరోసారి ఖండించారు.