ఆ విషయం నారాయణరెడ్డి ఎప్పుడూ చెప్పలేదు.. పోలీసులే తేలుస్తారు: కేఈ
అతని గన్ లైసెన్స్ రెన్యువల్ విషయం పోలీసులకే తెలుసన్నారు. నారాయణరెడ్డి గన్ లైసెన్స్ రెన్యువల్ ఎందుకు చేయలేదనేది కూడా పోలీసులనే అడగాలని కేఈ చెప్పుకొచ్చారు.
విజయవాడ: గవర్నర్ కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై డిప్యూటీ సీఓం కేఈ స్పందించారు. తన కుమారుడి ఇసుక దందాపై పోరాడినందుకే నారాయణరెడ్డిని హత్య చేశారనడం సరైంది కాదన్నారు. ఈ హత్యకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఇకపోతే నారాయణరెడ్డి తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని ఏనాడు తనతో చెప్పలేదన్నారు కేఈ. కేవలం పోలీసులకు మాత్రమే ఆ విషయం చెప్పాడని, అతని గన్ లైసెన్స్ రెన్యువల్ విషయం పోలీసులకే తెలుసన్నారు. నారాయణరెడ్డి గన్ లైసెన్స్ రెన్యువల్ ఎందుకు చేయలేదనేది కూడా పోలీసులనే అడగాలని కేఈ చెప్పుకొచ్చారు.
జరిగిన సంఘటన దురదృష్టకరమని, నారాయణరెడ్డి హంతకులెవరనేది పోలీసులే తేలుస్తారని కేఈ అన్నారు. ఇకపై కర్నూలు జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చూస్తానని అన్నారు.
హైకోర్టు నా పేరు పేర్కొందా?
కర్నూలు జిల్లాలో కేఈ కుమారుడు ఇసుక దందాకు పాల్పడుతున్న ఆరోపణలతో ఇసుక మాఫియాపై నారాయణరెడ్డి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. దందాలపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 'హైకోర్టు ఆదేశాల్లో నా పేరు గానీ కొడుకు పేరు గానీ ఉందా?, నా వారసుడన్న కారణంతోనే వానిపై అభాండాలు వేస్తున్నారు' అని కేఈ పేర్కొన్నారు. ఇసుక దందాపై కలెక్టర్, ఉన్నతాధికారులతో బహిరంగ చర్చ పెట్టినప్పుడు.. ఎవరూ ముందుకురాలేదన్న విషయాన్ని గుర్తుచేశారు.