కేసీఆర్ ఆగ్రహం: మన్నించాలని రాజయ్య లేఖ! కన్నీటి పర్యంతం...?
హైదరాబాద్: తాను తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని, అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వివరణ ఇచ్చుకున్నారు. ఆయన కేసీఆర్కు సుదీర్ఘ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. పరిపాలన అనుభవం లేకనే అలా జరిగిందని చెప్పారు. తెలియక పొరపాటు ఉంటే మన్నించాలని కోరారు.
ముఖ్యమంత్రికి లేఖ రాసిన రాజయ్య సన్నిహితుల వద్ద కూడా ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తాను ఉద్దేశ్యపూర్వకంగా తప్పు చేస్తే ఉరి తీయవచ్చునని, దళిత కుటుంబంలో పుట్టుడమే తాను చేసిన నేరమా అని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.
స్వైన్ ఫ్లూ పైన అన్ని చర్యలు తీసుకున్నామని, కేసీఆరే అది థర్డ్ క్లాస్ వైరస్ అన్నారని తెలుస్తోంది. హైప్ చేయడం వల్ల జనం మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారని, దాని వల్ల డాక్టర్లు బతుకుతున్నారని, మీడియా కూడా సహకరించడం లేదని, దళితుడిని అయినందువల్లే వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.
రాష్ట్రంలో 108, 104 సేవల నిర్వహణకు కొత్తగా 285 వాహనాల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, నేను కలిసినప్పుడల్లా వాటి కొనుగోలు ఎంతవరకు వచ్చిందని కేసీఆర్ అడుగుతున్నారని, అందుకే ఈ వాహనాలను తొందరగా కొనుగోలు చేయాలని అధికారులకు చెప్పానని, అయితే, ఇంతవరకు టెండర్లు పూర్తి కాలేదని, వాహనాల సరఫరాకు వివిధ కంపెనీలు పోటీ పడుతున్నాయని, టెండర్లు పూర్తి కాకుండానే అక్రమాలు అనడం సరికాదని చెప్పారని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో తాను ఒక్కడినే దళితుడినని, కొందరు సహచర మంత్రులు కావాలనే తనను చిన్నచూపు చూస్తున్నారన్న భావనలో ఆయన ఉన్నారంటున్నారు. ఓ దశలో రాజయ్య కన్నీళ్ల పర్యంతమవుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
స్వైన్ ఫ్లూ లక్షణాలను గమనించగానే వరుసగా మూడు రోజులు ఆస్పత్రులను సందర్శించానని, భయాందోళనలు వద్దని రోగుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశానని, కానీ, స్వైన్ ఫ్లూపై ప్రధాని మోడీ, కేంద్ర ఆరోగ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లారని, దానిని కేబినెట్లో పెట్టారు. దానిపై హడావుడి చేయటం వల్ల భయాందోళనలు తీవ్రంగా పెరిగిపోయాయని, ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా జనం ముక్కుకు మాస్క్తో కనిపిస్తున్నారని చెప్పారంటున్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బతగులుతుందని దానిపై ఎక్కువ హడావుడి చేయకుండా అంతర్గతంగా చర్యలు తీసుకున్నానని, కానీ, ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని, ఇక్కడికి వస్తే స్వైన్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందని ప్రపంచవ్యాప్తంగా మనమే చెప్పినట్లు అయ్యిందని వ్యాఖ్యానించారంటున్నారు. ఇంత చేస్తే కేసీఆరే చివరికి స్వైన్ ఫ్లూ థర్డ్ క్లాస్ వైరస్ అని తేల్చారని చెప్పారంటున్నారు.